
లండన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) సందర్భంగా లండన్లోని స్ట్రాండ్లోని ఐకానిక్ స్క్వేర్ వద్ద వందలాది మంది ప్రజలు యోగాభ్యాసాన్ని చేశారు. లండన్లోని భారత హైకమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిపుణుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ఆసనాలు వేయడంతో పాటు శ్వాస పద్ధతులను నేర్చుకున్నారు.
యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవ వేడుకలు యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ఆధ్వర్యంలో జరిగగా, రాజు చార్లెస్ III ప్రత్యేక సందేశాన్ని చదవడంతో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ‘ఈ వార్షిక వేడుక ఐక్యత, కరుణ, శ్రేయస్సులతో మిళితమైన ప్రపంచ సూత్రాలను ప్రోత్సహిస్తున్నదని కింగ్ ఛార్లెస్ అన్నారు. యోగా డే అనేది ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడంలో యోగాకున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందని బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కింగ్ చార్లెస్- III తన సందేశాన్ని వినిపించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం లాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో యోగాకు ప్రజాదరణ లభిస్తోంది. దేశంలో లక్షలాది మంది యోగాభ్యాస ప్రయోజనాలను పొందుతున్నారు. యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయుక్తమయ్యే శక్తివంతమైన సాధనం. ఇది సమాజాలలో శ్రేయస్సు, ఐక్యతల సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన యోగా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించినప్పటి నుండి యోగా డే ఎలా జరుగుతున్నదీ దొరైస్వామి వివరించారు.
ఈ ఏడాది యోగా డే కార్యక్రమం ఇండియా హౌస్ సమీపంలో ఉన్న కింగ్స్ కాలేజ్ లండన్తో భాగస్వామ్యంతో నిర్వహించారు. ‘డ్రమ్స్ ఆఫ్ ఇండియా’ సంగీత విభావరితో కార్యక్రమం ప్రారంభమయ్యింది. అనంతరం సూర్య నమస్కారాలు చేశారు. హార్ట్ఫుల్నెస్ యూకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్లకు చెందిన నిపుణులు, శ్వాస పద్ధతులను, యోగాభ్యాసాలను కార్యక్రమానికి హాజరైన ప్రజల చేత ఆచరింపజేశారు.
ఇది కూడా చదవండి: యోగా జిల్లాగా మైసూరు?.. ఘనత ఇదే..