షట్‌డౌన్‌కు తెర  | US Government Shutdown Ends After 43 Days As President Donald Trump Signs Funding Bill, More Details Inside | Sakshi
Sakshi News home page

షట్‌డౌన్‌కు తెర 

Nov 13 2025 7:51 AM | Updated on Nov 14 2025 5:16 AM

US House passes bill to end government shutdown

ప్రభుత్వ నిధుల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం  

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 రోజులపాటు కొనసాగిన షట్‌డౌన్‌ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యుల కష్టాలకు తెరపడింది. షట్‌డౌన్‌కు ముగింపు పలికే గవర్నర్‌మెంట్‌ ఫండింగ్‌ బిల్లు సోమవారం సెనేట్‌లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. 

అనంతరం అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 222, వ్యతిరేకంగా 209 ఓట్లు వచ్చాయి. అధికార రపబ్లికన్‌ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వగా, విపక్ష డెమొక్రాట్లు బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు గట్టెక్కింది. అనంతరం గంటల వ్యవధిలోనే అధ్యక్షుడి ఆమోదం కోసం బిల్లును పంపించడం, ఆయన సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి.  

దోపిడీకి అమెరికా లొంగదు: ట్రంప్‌   
షట్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులకు ఇన్నాళ్లూ వేతనాలు ఆగిపోయాయి. ఆఖరికి ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలపైనా భారీ ప్రభావం పడింది. ఆహారం కోసం ఫుడ్‌ బ్యాంకుల ఎదుట జనం బారులు తీరాల్సి వచి్చంది. షట్‌డౌన్‌ ఆగిపోవడంతో ఆ కష్టాలకు ఇక తెరపడినట్లే. ప్రజల కష్టాలకు డెమొక్రాట్లే కారణమని డొనాల్డ్‌ ట్రంప్‌ నిందించారు. వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 ఈ విషయం మర్చిపోవద్దని కోరారు. విపక్ష సభ్యులు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. అమెరికా ఎప్పటికీ దోపిడీకి లొంగిపోదన్న సందేశాన్ని పంపిస్తున్నామని ట్రంప్‌ చెప్పారు.  అమెరికన్లకు రాయితీపై చౌకగా వైద్య సేవలందించే అంశంపై అధికార, విపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభన చివరకు షట్‌డౌన్‌కు దారితీసింది. ఈ రాయితీ ఈ ఏడాది ఆఖర్లో ముగిసిపోనుండగా, దాన్ని ఇంకా పొడిగించాలని డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు డిమాండ్‌ చేశారు. 

ట్రంప్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అక్టోబర్‌ 1న షట్‌డౌన్‌ మొదలైంది. అత్యవసరం కాని సాధారణ ప్రభుత్వ సేవలకు నిధుల విడుదల ఆగిపోయింది. విపక్షాలను దారికి తీసుకురావడానికి కొందరు ఉద్యోగులను ట్రంప్‌ బలవంతంగా తొలగించారు. ప్రభుత్వ నిధుల బిల్లు ప్రకారం.. తొలగింపుకు గురైన ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకుంటారు. ప్రభుత్వ సేవలకు యథావిధిగా నిధులు విడుదల చేస్తారు. మరోవైపు రాయితీపై ఆరోగ్య సేవలను కొనసాగించడంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో చర్చలు జరుగనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement