సెయింట్పీటర్స్బర్గ్ చమురు టర్మినల్పై దాడి
కీవ్: దురాక్రమణ జెండా ఎగరేసి తమ భూభాగాలను ఆక్రమిస్తున్న రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దండును పంపి దాడికి తెగబడింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని కీలక చమురు టర్మినల్పై డ్రోన్లు దాడిచేశాయి. దీంతో నౌకాశ్రయం సమీప టర్మినల్ నుంచి అగ్నికీలలు ఎగసిపడి దట్టంగా నల్లటి పొగ వెలువడుతున్న వీడియోలను అంతర్జాతీయ మీడియా ప్రసారంచేసింది. ఉక్రెయిన్పై భీకరంగా రష్యా దాడి చేసి 22 మంది పౌరులను చంపేసి, 138 మందిని గాయపరిచిన ఘటన జరిగిన 24 గంటలకే రష్యాపై ఉక్రెయిన్ ప్రతిదాడులుచేయడం గమనార్హం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తాను పుట్టిపెరిగిన సెయింట్ పీటర్స్బర్గ్లో స్వంతంగా శుక్రవారం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు సంసిద్ధమవుతున్న వేళ ఈ దాడిజరిగింది. వేయి కిలోమీటర్ల ప్రయాణించి మరీ తమ డ్రోన్లు రష్యాలో విధ్వంసం సృష్టించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం తన సోషల్మీడియా ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. దాడి దెబ్బకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. దాడి జరిగిన నష్టవివరాలను రష్యా ప్రభుత్వం బయటపెట్టలేదు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రష్యా సొంతంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండగా పుతిన్ సారథ్యంలో జరిగేదానిని రష్యా దావోస్గా పిలుస్తుంటారు. మరోవైపు ఇరాన్ యుద్ధంతో సొంతంగా పాట్రియోట్ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా విచ్చలవిడిగా వాడేస్తుండటంతో మిత్రదేశమైన ఉక్రెయిన్కు వాటిని గతంలోమాదిరి సరఫరా చేసే పరిస్థితిలేదు. దీంతో ఉక్రెయిన్లో ఇప్పుడు వీటి కొరత ఎక్కువైంది. రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా తగ్గిపోయిందని, యూరప్ దేశాలు ఇతోధికంగా సాయం చేయల్సిన అవసరం ఏర్పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. బుధవారమే కీవ్లో పర్యటించిన నాటో చీఫ్ మార్క్ ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సమావేశంకానున్నారు.
నౌకాస్థావరంపైనా..
కోల్టీన్ ద్వీపం సమీపంలోని రష్యా క్రోన్స్టార్డ్ నౌకాస్థావరం పైనా ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. రష్యా బాల్టీక్ విభాగ నౌకాస్థావరం, ఆయుధాగారం సైతం ఇక్కడే ఉన్నాయి. దాడికి తెగించిన 354 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. మరోవైపు రష్యా ఆక్రమించిన డోనెట్సషేక్లోని బస్సుపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఏడుగురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారని క్రిమ్లిన్ నియమించిన డోనెట్సషేక్ ప్రాంత చీఫ్ డెనిస్ పుషిలిన్ వెల్లడించారు.


