
టెహ్రాన్ ప్రజలకు ట్రంప్ సూచన
జీ7 సదస్సు నుంచి స్వదేశానికి
కనానాస్కిస్/వాషింగ్టన్: జీ7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండడంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ట్రంప్ సూచించారు.
ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కెనడాలో మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సాయంత్రం జీ7 దేశాల అధినేతలతో ఫొటోలు దిగారు. ‘‘నేను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి. చాలా ముఖ్యం’’ అని చెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు.
దాడులు ఆగాలంటే ఆణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా పాత్ర ఏమిటి? అని ప్రశ్నించగా.. స్పందించడానికి నిరాకరించారు.
ఇరాన్కు అణుబాంబు దక్కదు
అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.
ఇజ్రాయెల్ సైన్యానిదీ అదేమాట
టెల్ అవీవ్/టెహ్రాన్: ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసంచేయాలని, అణు శాస్త్రవేత్తలను, కీలక సైనికాధికారులను అంతమొందించాలని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మధ్యభాగంలో క్షిపణి దాడులకు సిద్ధమవుతోంది. సెంట్రల్ టెహ్రాన్లో ఉంటున్న 3.30 లక్షల మంది బయటకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.
టెహ్రాన్ను పూర్తిగా ఖాళీ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పిన కాసేపటికే సైన్యం అదే తరహాలో ఆదేశాలివ్వడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టీవీ, పోలీసు ప్రధాన కార్యాలయాలతోపాటు ముఖ్యమైన ఆసుపత్రులు సెంట్రల్ టెహ్రాన్లోనే ఉన్నాయి. రాజధాని నగరంలో 90 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఇక్కడ వైమానిక దాడులు జరిగితే ప్రాణనష్టం ఊహించని స్థాయిలో సంభవించే అవకాశం ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.