వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.
కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.


