
2025 జూన్ 26న చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో ఉమ్మడి ప్రకటన పత్రంపై సంతకం చేయడాన్ని ఆయన నిరాకరించారు.
బీజింగ్/న్యూఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh).. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన జాయింట్ డాక్యుమెంట్ను ఆయన ముందు ఉంచారు. అయితే..
అందులో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే..
చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తోంది. ఇందులో ఆతిథ్య దేశంతో పాటు భారత్, పాకిస్థాన్తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. బెలారస్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ఈ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. సదస్సు అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్.. జమ్మూకశ్మీర్లో చోటుచేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు. అదే సమయంలో బలోచిస్థాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది.
దీంతో ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంతో రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. అయితే.. పాకిస్థాన్ వల్లే చైనా ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గాం ప్రస్తావనను మినహాయించి ఉంటుందనే సంకేతాలు కన్పిస్తున్నాయి.
🚨Breaking News:
Rajnath Singh refused to sign the SCO joint statement.
Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on Pulwama
And Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025
అంతకుముందు ఎస్సీవో సదస్సులో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా దాయాది పాక్ను దుయ్యబట్టారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ రక్షణమంత్రులు ఎదురుపడటం ఇదే తొలిసారి. అయితే, ఈ సదస్సులో వీరిద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదని సమాచారం. 2020లో గల్వార్ ఘర్షణ తర్వాత నుంచి భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.