ట్రంప్‌కు ‘నోబెల్‌ శాంతి’ ఇవ్వాలి  | Pakistan to nominate Donald Trump for Nobel peace prize | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ‘నోబెల్‌ శాంతి’ ఇవ్వాలి 

Jun 22 2025 5:06 AM | Updated on Jun 22 2025 5:06 AM

Pakistan to nominate Donald Trump for Nobel peace prize

ఆయన పేరు ప్రతిపాదించాలని నిర్ణయించాం 

పాకిస్తాన్‌ ప్రభుత్వం వెల్లడి  

ఇస్లామాబాద్‌/న్యూయార్క్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్‌–పాకిస్తాన్‌ ఘర్షణ ఆగేలా ట్రంప్‌ కృషి చేశారని, అందుకు నోబెల్‌ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. మూడు రోజుల క్రితం ట్రంప్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్‌ మునీర్‌ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్‌ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్‌–పాక్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్‌–పాక్‌ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్‌ చొరవే కారణమని స్పష్టంచేసింది. 

రక్త పిపాసులకా! 
నోబెల్‌ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు ప్రతిపాదించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటా బయ టా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్‌ సర్కారు తీరును పలువురు తప్పుపట్టారు. పాక్‌ పౌరులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నిపుణులు కూడా వీరిలో ఉన్నారు. ఒకవైపు గాజాలో మారణహోమం సృష్టిస్తూ, మరోవైపు ఇరాన్‌లో రక్తం పారిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నందుకు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలా? అని మండిపడ్డారు. 

హింసాకాండను సమరి్థస్తున్న వ్యక్తి ఈ బహుమతికి ఎలా అర్హుడో చెప్పాలని నిలదీశారు. పాక్‌ ప్రభుత్వం ఆత్మగౌరవం అనేది లేకుండా ట్రంప్‌ చేతిలో కీలు»ొమ్మగా మారిందని సామాజిక కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. శాంతి, న్యాయం కోసం నిజాయతీగా కృషి చేసినవారికే నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని, అమాయక ప్రజల రక్తంతాగే వారికి కాదని తేల్చిచెప్పారు. పాక్‌ సర్కారు నిర్ణయానికి ప్రజల ఆమోదం లేదని స్పష్టంచేశారు. నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

నాకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కదేమో 
డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వేదం  
భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధాన్ని ఆపేసినందుకు లేదా రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఘర్షణలు నివారించేందుకు కృషి చేస్తున్నందుకు తనకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కదేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి తనకు రాసిపెట్టి లేదేమోనని నిర్వేదం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్‌ శాంతి బహుమతి రాదన్నారు. 

దశాబ్దాలుగా యుద్ధ రంగంలో తలపడుతున్న కాంగో, రువాండా మధ్య శాంతికి చొరవ తీసుకుంటున్నానని, అందుకు చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగబోతోందని, ఆఫ్రికాతోపాటు ప్రపంచానికి అదొక గొప్ప రోజు కాబోతోందని వివరించారు. సెర్బియా, కొసావో మధ్య ఘర్షణలకు చరమగీతం పాడేశానని, ఈజిప్టు, ఇథియోపియా మధ్య శాంతిని కొనసాగిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించే అవకాశం లేదని ట్రంప్‌ నిరాశకు లోనయ్యారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement