
భూకంపంతో అపార నష్టం
ఇప్పటికే 1,600 దాటిన మృతులు
10 వేలకు మించవచ్చని అంచనా
3,500 మందికి పైగా క్షతగాత్రులు
బ్యాంకాక్: భూకంపం మయన్మార్ వెన్ను విరిచింది. అంచనాలకు కూడా అందనంతటి నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలు, వారి సంబం«దీకుల ఆక్రందనలే. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడ్డారు.
మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో కునారిల్లుతున్న ఆ దేశానికి ఇది పులిమీద పుట్రలా పరిణమించింది. అత్యవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు కనీస స్థాయి మౌలిక వనరులు కూడా లేక సైనిక సర్కారు చేతులెత్తేస్తోంది. శిథిలాల నుంచి మృతులు, క్షతగాత్రుల వెలికితీతకు అవసరమైనన్ని భారీ క్రేన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి! దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
ఫలితంగా శిథిలాల కింద చిక్కిన వారిలో అత్యధికులు మృత్యువాత పడే దుస్థితి నెలకొంది. నిస్సహాయ స్థితిలో ఉన్న మయన్మార్కు భారత్ తక్షణం ఆపన్నహస్తం అందించింది. ఇతర దేశాల నుంచి కూడా మయన్మార్కు సాయం అందుతోంది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నేపిడా సమీపంలో మూడు గంటల తేడాతో రెండుసార్లు భూమి కంపించింది. 4.3, 4.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపాల తాలూకు నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. గత 24 గంటల్లో మయన్మార్లో 14కు పైగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
కుప్పకూలిన కంట్రోల్ టవర్
భూకంప ధాటికి నేపిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కంట్రోల్ టవర్ కుప్పకూలి శిథిలాల దిబ్బగా మారింది. విమాన సేవలు ఆగిపోవడంతో భారత్ తదితర దేశాల నుంచి వస్తున్న సహాయక విమానాలు యాంగూన్లో దిగుతున్నాయి.
థాయ్లాండ్లో...
థాయ్లాండ్లో భూకంపం తాలూకు విధ్వంస తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాజధాని బ్యాంకాక్తో పాటు పలు నగరాల్లో భవనాలు, ఆస్పత్రులు, ఆలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలో కనీసం 2,000 పైచిలుకు భవనాలు తీవ్రంగా పగుళ్లిచ్చినట్టు గవర్నర్ తెలిపారు.
334 అణుబాంబుల శక్తి!
మయన్మార్ భూకంపం ఏకంగా శక్తిమంతమైన 334 అణుబాంబుల పేలుడుకు సమానమైన శక్తిని విడుదల చేసినట్టు జియాలజిస్టులు తేల్చారు! మాండలే, పరిసర ప్రాంతాలకు ముప్పు ఇంకా తొలగలేదని వారు హెచ్చరించారు. అక్కడ
ఒకట్రెండు నెలల పాటు ప్రకంపనలు కొనసాగే ఆస్కారముందని వివరించారు.
రోడ్డుపైనే ప్రసవం
శుక్రవారం మధ్యాహ్న వేళ. భూకంపం దెబ్బకు బ్యాంకాక్ అతలాకుతలమైంది. జనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లూ, భవనాలు వీడుతున్నారు. ఉన్నపళంగా రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి రోగులను ఫైర్ సేఫ్టీ మార్గం గుండా బయటికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో ఓ నిండు గర్భిణికి నడిరోడ్డు మీదే పురిటి నొప్పులు మొదలయ్యాయి. చుట్టూ గందరగోళం మధ్యే వైద్య సిబ్బంది సమక్షంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
15 మంది సజీవం!
భూకంపం ధాటికి బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలడం తెలిసిందే. పదుల సంఖ్యలో నిర్మాణ కారి్మకులు, సిబ్బంది శిథిలాల కింద చిక్కుబడ్డట్టు చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన 100 మందిలో అత్యధికులు ఆ శిథిలాల కిందే ఉన్నట్టు భావిస్తున్నారు. దాంతో వారి బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. వారిలో కనీసం 15 మంది ప్రాణాలతో ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. శిథిలాల అడుగుభాగం నుంచి వారి మూలుగులు, సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు తమకు లీలగా వినిపిస్తున్నాయని సిబ్బంది చెప్పారు.