భారత్‌ దెబ్బ అదుర్స్‌.. మాల్దీవుల ముయిజ్జు కొత్త రాగం | Maldives President Muizzu Interesting Comments On India | Sakshi
Sakshi News home page

భారత్‌ దెబ్బ అదుర్స్‌.. మాల్దీవుల ముయిజ్జు కొత్త రాగం

Aug 10 2024 6:15 PM | Updated on Aug 10 2024 6:15 PM

Maldives President Muizzu Interesting Comments On India

ప్రధాని మోదీ, భారత్‌పై మాల్దీవుల రాజకీయ నేతల అనుచిత వ్యాఖ్యల కారణంగా రెండు దేశాల మధ్య రాజకీయంగా పెను దుమారమే చెలరేగింది. దీంతో, మాల్లీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల పర్యటనలో అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో, భారత్‌ దెబ్బకు ముయిజ్జు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, జైశంకర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ముయిజ్జుతో భేటీ కావడం ఆనందగా ఉంది. భారత ప్రధాని మోదీ తరఫున మాల్దీవుల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అయితే, చివరిసారిగా 2023 జనవరిలో జైశంకర్‌ మాల్దీవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

ఇక, వీరి భేటీ అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ భారత్‌ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులకు భారత్‌ ఎల్లప్పుడూ మిత్ర దేశమేనని చెప్పుకొచ్చారు. మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని అన్నారు. ఆర్థికంగా భారత్‌ తమకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. అలాగే, తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయం చేయడంతో భారత్‌ ముందు ఉంటుందని పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే సమయంలో భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ దేశం పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

 

 

ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లక్షద్వీవుల్లో పర్యటించిన అనంతరం భారత్‌, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దీంతో, భారతీయులు ఎవరూ మాల్దీవులకు వెళ్లవద్దంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మాల్దీవుల పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. భారత్‌లో మైత్రికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత్‌లో పర్యటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement