ఆఫ్రికా దేశమైన Democratic Republic of the Congoలో ఎబోలా వైరస్ విజృంభిస్తుంది. ఈశాన్య ప్రాంతంలోని బునియా నగర సమీపంలోని కిగోంజే శరణార్థి శిబిరంలో మే నెల ప్రారంభం నుంచి కనీసం 30 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 933 కేసులు నమోదయ్యాయని, ఇందులో 245 మంది మృతి చెందారని కాంగో ఆరోగ్య మంత్రి ప్రకటించారు.
15 వేల మందికిపైగా నివసిస్తున్న కిగోంజే శిబిరంలో సాధారణంగా నెలకు ఒకటి నుంచి మూడు మరణాలు మాత్రమే నమోదవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే గత కొన్ని వారాల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది.
వైరస్ వేగంగా వ్యాపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తలనొప్పి, జ్వరం, వాంతులు ఎబోలా ప్రధాన లక్షణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది.
50 లక్షల నిరాశ్రయుల్లో భయం
తూర్పు కాంగోలో యుద్ధాలు, ఘర్షణల కారణంగా 50 లక్షల మందికిపైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో జీవిస్తున్నారు. కిగోంజేలో నమోదైన మరణాలు చూస్తే, వైరస్ ఇతర శిబిరాల్లో కూడా వ్యాపించిందేమోన్న అనుమానాలు కలిగిస్తుంది.


