ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి | Israeli Military hits Iran Defence Ministry hq Nuclear site | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి

Jun 15 2025 8:13 AM | Updated on Jun 15 2025 12:21 PM

Israeli Military hits Iran Defence Ministry hq Nuclear site

టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్‌ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.

ఇజ్రాయెల్‌ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్‌లు మోగించారు. ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న  ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో.. 

Advertisement
 
Advertisement
Advertisement