
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది.
గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు.