‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ వైరల్‌ ఫొటోపై ఇజ్రాయెల్‌ కౌంటర్‌ | Israel's Counter To All Eyes On Rafah Photo: 'Where Were Your Eyes On' | Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ వైరల్‌ ఫొటోపై ఇజ్రాయెల్‌ కౌంటర్‌

May 30 2024 10:38 AM | Updated on May 30 2024 11:01 AM

Israel's Counter To All Eyes On Rafah Photo: 'Where Were Your Eyes On'

హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్‌ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై  భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.

 

 ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్‌ చేసి పాలస్తీనా  పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్‌  చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత  మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.

 

అయితే సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్‌ స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్‌ 7 ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు  చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్‌ చెరలో ఉన్న  ఇజ్రాయెల్‌ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్‌ వర్‌ యువర్‌ ఐస్‌’అని  చిన్నపిల్లాడి ముందు హమాస్‌ మిలిటెంట్‌ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్‌ చేసి  కౌంటర్‌  ఇచ్చింది.

‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ ఫొటో హాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 45  మిలియన్ల మంది షేర్‌ చేశారు.  భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్‌ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్‌, అలియా బట్‌, కరీనా కపూర్‌ ఖాన్‌, మధూరి దీక్షిత్‌,  వరుణ్‌ దావన్‌, సమంత్‌ రుత్‌ ప్రభు తదితరులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement