
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పరస్పరం చోటుచేసుకున్న వైమానిక దాడులు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి. తన చిరకాల శత్రువు అయిన ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులకు దిగినట్లు ఇరాన్ చెబుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు సంబంధించిన 10 ముఖ్యమైన పరిణామాలు ఇలా ఉన్నాయి.
1. ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లను మోగించారు. ఇవి స్థానికులను భద్రత దిశగా పరిగెత్తేలా చేశాయి. ఇరానియన్ క్షిపణులను అడ్డుకునేందుకు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
2. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం డజన్ల కొద్దీ క్షిపణులను ఇరాన్ నుండి ప్రయోగించారు. వాటిలో కొన్నింటిని అడ్డుకున్నారు. ఈ దాడిలో ప్రాణనష్టంపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అయితే శిధిల ప్రదేశాలలో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.
3.ఇజ్రాయెల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం టెల్ అవీవ్లో ఒక క్షిపణి కూలిపోయింది. జెరూసలేంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దీని వెనుక ఇరానియన్ దాడులు ఉన్నాయా? లేదా ఇజ్రాయెల్ రక్షణ చర్యలు ఉన్నాయా అనేది వెల్లడికాలేదు.
4. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాము మరిన్ని దాడులు చేయబోతున్నామన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిందని ఆరోపించారు.
5. రాజధాని టెహ్రాన్లో కూడా భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.

6. ఇరాన్ ఫార్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి రెండుసార్లు దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మూడవ దఫా వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇది జరిగింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు ప్రదేశాలు, కమాండర్లు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
7. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇకపై సురక్షితంగా ఉండబోదని, ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
8. టెల్ అవీవ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 34 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలయ్యాయని ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. తరువాత ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు.
9. ఇజ్రాయెల్ దిశగా కదులుతున్న ఇరానియన్ క్షిపణులను కూల్చివేసేందుకు యూఎస్ మిలిటరీ సహాయం చేసిందని ఇద్దరు యూఎస్ అధికారులు తెలిపారు.
10. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రాంతీయ ఘర్షణల భయాలను మరింతగా పెంచాయి.
ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..