ఆండీ బర్న్హామ్ ప్రస్థానం
లండన్: ప్రధాని పీఠం నుంచి స్టార్మర్ తప్పుకోవడంతో తదుపరి ప్రధాని పోరు మొదలైంది. ఈ పోటీలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ ముర్రే బర్న్హామ్ ముందంజలో ఉన్నారని బ్రిటన్ మీడియా కోడై కూస్తోంది. ప్రజలే స్వయంగా ‘కింగ్ ఆఫ్ ది నార్త్’కిరీటాన్ని తలపై పెట్టడంతో ఆండీ గురించి చర్చ ఆరంభమైంది. పరిశోధకునిగా తన కెరీర్ను మొదలెట్టి తర్వాత కేబినెట్ మంత్రిగా కొన్నేళ్లు పనిచేశారు.
1970 జనవరి ఏడున ల్యాంక్షైర్లోని మెర్సీసైడ్లో జన్మించారు. బర్న్మామ్ తండ్రి టెలిఫోన్ ఇంజనీర్కాగా తల్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్. బర్న్హామ్ గతంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్య సించారు. 15 ఏళ్ల వయసులోనే లేబర్ పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యురాలు టెసా జోవెల్ వద్ద పరిశోధకునిగా పనిచేశారు. తర్వాత 1995లో బ్రిటన్లో పెద్ద కార్మిక సంఘాల్లో ఒకటైన ట్రాన్స్పోర్ట్ అండ్ జనరల్ వర్కర్స్ యూనియన్లో సేవలందించారు.
నేషనల్ హెల్త్ సర్వీస్ కాన్ఫెడరేషన్కు పార్లమెంటరీ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత సంస్కృతి, మీడియా, క్రీడల శాఖకు ప్రత్యేక సలహాదారుగా సేవలందించారు. 2001లో లీగ్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. గోర్డెన్ బ్రౌన్ హయాంలో ఆర్థిక శాఖలో పనిచేశారు. తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు.
2015, 2017లో రెండు సార్లు పార్టీ అగ్రనాయకత్వ పదవికి కోసం పోటీపడి విఫలమయ్యారు. తర్వాత 2019లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. తర్వాతి ఎన్నికల్లోనూ గెలిచారు. కన్జర్టేటివ్ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సంక్షోభసమయంలో ప్రభుత్వతీరును ఎండగట్టారరు. లండన్, ఆగ్నేయ ప్రాంతాలతో పోలిస్తే మాంచెస్టర్ వంటి ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతాలకు నిధులు కేటాయింపులు సరిగా లేవని ఉద్యమించారు. దీంతో జాతీయస్థాయిలో ఈయన పేరు మార్మోగిపోయింది.


