
వైమానిక దాడుల నేపథ్యంలో గాజా స్ట్రిప్లో ధ్వంసమైన తమ ఇంట్లోంచి ఆకాశంవైపు భయంతో చూస్తున్న చిన్నారులు
గాజా స్ట్రిప్/జెరూసలేం: కాలే కడుపులకు తిండి లేదు, దాహంతో అలమటిస్తున్న గొంతులకు గుక్కెడు నీరు లేదు, ఆసుపత్రుల్లో ఔషధాలు లేవు, రాత్రయితే కరెంట్ లేదు. దూసుకొస్తున్న రాకెట్లు, కళ్లెదుటే కుప్పకూలుతున్న భవనాలు, ప్రాణాలు కోల్పోతున్న సామాన్య జనం. ఇజ్రాయెల్ బలగాల నిర్బంధంలో చిక్కుకున్న గాజాలో ప్రస్తుత దయనీయ పరిస్థితి ఇది. గాజాలోకి ఆహారం, నీరు, కరెంటు సరఫరా కాకుండా దారులు మూసుకుపోయాయి. ఈజిప్టు తన సరిహద్దును మూసివేసింది.
గాజాలోని 23 లక్షల మంది జనం అల్లాడిపోతున్నారు. కొందరు మరో దారిలేక ఉప్పునీరు, అపరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. ఇజ్రాయెల్ కరుణిస్తే తప్ప వారికి ఆహారం, మంచినీరు దొరకదు. హమాస్ చేతిలో ఉన్న బందీలు విడుదలైన తర్వాతే సరఫరాల గురించి ఆలోచిస్తామని ఇజ్రాయెల్ తేల్చిచెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై వారం రోజులు దాటింది.
ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. శత్రువులను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు దూసుకెళ్తోంది. మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు ఎక్కుపెడుతున్నారు. ఈ పోరాటంలో గాజాలో ఇప్పటిదాకా 2,329 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్లో 1,300 మందికిపైగా జనం మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,000కుపైగా ఇళ్లు కూలిపోయాయి.
Children in Gaza suffer from panic attacks as a result of the heavy lsraeli bombing which hasn’t stopped for nine consecutive days. pic.twitter.com/tMDmTYk2En
— TIMES OF GAZA (@Timesofgaza) October 15, 2023
పాలస్తీనియన్ల కోసం రెండు కారిడార్లు
ఉత్తర గాజాను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, సొంత ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్నారు. వారికోసం రెండు సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉత్తర గాజా క్రమంగా ఖాళీ అవుతోంది. 10 లక్షల మందికిపైగా జనం తరలివెళ్లాలంటే వారం రోజులకుపైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి, గాజాలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వేలాది మంది బాధితులు ఎటూ కదల్లేకపోతున్నారు. ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇంధనం కొరతతో చికిత్సలు ఆగిపోయాయి. గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలను సమూలంగా నాశనం చేయక తప్పదని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం పునరుద్ఘాటించింది. మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించింది. కలుగులో దాక్కున్నా చావు తప్పదని హమాస్ సభ్యులను హెచ్చరించింది.
ఆసుపత్రుల్లో బాలింతలు, శిశువులు
యుద్ధం ఉధృతంగా మారుతుందని, ఉత్తర గాజా నుంచి సామాన్య ప్రజలంతా సాధ్యమైనంత త్వరగా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదివారం ఇజ్రాయెల్ సూచించింది. విమానాల ద్వారా కరపత్రాలు జారవిడిచింది. కాగా, ఉత్తర గాజా నుంచి ఎవరూ వెళ్లొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని పాలస్తీనియన్లకు హమాస్ విజ్ఞప్తి చేసింది. ఉత్తర గాజాలోని ఆసుపత్రిల్లో 2,000 మందికిపైగా బాధితులు ఉన్నారని, చాలామంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, ఇంక్యుబేటర్లలో శిశువులు ఉన్నారని, తరలింపు కార్యక్రమం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
బందీల కుటుంబ సభ్యుల ఆగ్రహం
హమాస్ అ«దీనంలో ఉన్న 150 మంది బందీల క్షేమ సమాచారం తెలియడం లేదు. బందీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులు టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తన భార్య, ముగ్గురు బిడ్డలను మిలిటెంట్లు అపహరించారని, వారిని క్షేమంగా తన వద్దకు చేర్చాలని అవిహై బ్రాడ్జ్ అనే వ్యక్తి కన్నీటితో వేడుకున్నాడు.
ఈజిప్టు సరిహద్దు తెరిస్తే..
ఈజిప్టు–గాజా మధ్యనున్న రఫా సరిహద్దును తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈజిప్టుతో చర్చిస్తోంది. గాజా ప్రజల కోసం వివిధ దేశాలు ఇచి్చన ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ప్రస్తుతం ఈజిప్టులో ఉన్నాయి. వాటిని గాజాకు చేర్చడానికి సరిహద్దును తెరవాలని అమెరికా అంటోంది. ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధ సాయం అందిస్తోంది. ఇప్పటికే ఒక యుద్ధవిమాన వాహక నౌకను మధ్యదరా సముద్రానికి పంపించింది. యూఎస్ఎస్ ఐసెన్హోవర్ యుద్ధనౌకను పంపించినట్లు అమెరికా రక్షణ మంత్రి అస్టిన్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సౌదీ అరేబియా యువరాజు సల్మాన్తో సమావేశమయ్యారు.
దక్షిణ గాజాకు వెళ్లకుండా అడ్డుకుంటున్న హమాస్
ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. అయితే, జనం వెళ్లిపోకుండా హమాస్ మిలిటెంట్లు ఎక్కడికక్కడ బలవంతంగా అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సామాన్య ప్రజలను రక్షణ కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడుకోవాలన్నదే మిలిటెంట్ల అసలు లక్ష్యమని వెల్లడించింది. ఉత్తర గాజా ప్రజలు ముందుకు వెళ్లకుండా మిలిటెంట్లు వాహనాలను అడ్డుగా పెట్టి రోడ్లను దిగ్బంధిస్తున్నారని పేర్కొంది. వారి ఆరాటమంతా సొంత భద్రత కోసమేనని విమర్శించింది. హమాస్ మిలిటెంట్ల ఏరివేత కోసం ఉత్తర గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం అక్కడున్న పాలస్తీనియన్లకు మరికొంత సమయం ఇవ్వాలని యోచిస్తోంది. జనమంతా దక్షిణ గాజాకు చేరుకున్న తర్వాత భూతల దాడులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
హమాస్ సీనియర్ కమాండర్ బిలాల్ అల్–ఖేద్రా హతం
హమాస్ మిలిటెంట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాజా స్ట్రిప్లో శనివారం రాత్రి జరిగిన ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ బిలాల్ అల్–ఖేద్రా మరణించాడు. అంతేకాకుండా పలువురు ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. ఈ విషయన్ని ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం ట్వీట్ చేసింది. దక్షిణ ఇజ్రాయెల్లోని కిబుట్జ్ నిరిమ్, నిర్ ఓజ్లో గతవారం జరిగిన పలు దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. హమాస్ నుఖ్బా యూనిట్కు చెందిన దక్షిణ ఖాన్ యూనిస్ బెటాలియన్కు బిలాల్ నేతృత్వం వహిస్తున్నాడు.
నెతన్యాహూ, అబ్బాస్కు జో బైడెన్ ఫోన్
ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. గాజాలోని పాలస్తీనా ప్రజలకు వెంటనే మానవతా సాయం అందాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్తో జో బైడెన్ వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ ముదరకుండా చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు సరఫరా చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితితోపాటు ఈజిప్టు, జోర్డాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి మొదలైన తర్వాత మొహమ్మద్ అబ్బాస్తో బైడెన్ మాట్లాడడం ఇదే మొదటిసారి. నెతన్యాహూతో మాట్లాడడం ఐదోసారి.
టెస్లా కారు ప్రాణం కాపాడింది
ఇజ్రాయెల్లో హమాస్లో చేసిన దాడిలో టెస్లా మోడల్–3 ఎలక్ట్రిక్ కారు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ అధినేత గిలాద్ అల్బర్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే బాధితుడి వివరాలను బహిర్గతం చేయలేదు. గిలాద్ కథనం ప్రకారం.. బాధితుడు అత్యవసర బృందంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు దాడి చేస్తున్నారని తెలియడంతో తన టెస్లా మోడల్–3 కారులో అసెంబ్లీ పాయింట్ వద్దకు బయలుదేరాడు.
అతడిని చూడగానే మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. అది ఎలక్ట్రిక్ కారు అనే విషయం వారికి తెలియదు. డీజిల్ ట్యాంకు ఉండే భాగంపై కాల్పులు జరిపారు. నిజానికి అందులో డీజిల్ ట్యాంకు ఉండదు. టైర్లపై కూడా కాల్చారు. అయినా కారు చెక్కుచెదరలేదు. బాధితుడు మరింత వేగంగా కారులో ముందుకు దూసుకెళ్లాడు. కొన్ని బుల్లెట్లు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. రక్తం కారుతున్నా అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్యులు అతడికి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై టెస్లా, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. టెస్లా కారు వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు.