
మీ సంగతి చూసుకోండి అంటూ ట్రంప్ చురక
మాస్కో: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఆయన గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టంచేశారు.
ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే రష్యా ఎలా స్పందిస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దానిపై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఖమేనీ హత్య జరుగుతుందని అనుకోవడం లేదని పుతిన్ ఉద్ఘాటించారు. మరోవైపు పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘‘ముందు మీ సంగతి చూసుకోండి. ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి. నా కోసం ఈ సాయం చేయండి. మీ సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్–ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పుతిన్కు చురక అంటించారు.
ఆధునిక హిట్లర్ అంతం కావాల్సిందే
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వ్యాఖ్య
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలోన్ సిటీలో మీడియాతో మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’మాట్లాడారు. ‘‘మాకు పైనుంచి ఆదేశాలు అందాయి. పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. అసలు ఈపాటికే మేం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)ను పంపి ఆయనను అంతంచేయా ల్సింది. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్లా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారు. అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం’ అని కట్జ్ అన్నారు.