నేడు ఉనికే ప్రమాదంలో
కాపాడేందుకు విశ్వప్రయత్నాలు
కాలంతో పోటీపడుతున్న సైంటిస్టులు
అవడానికి అది చేప మాత్రమే. కానీ దాని ఘనత అంతా ఇంతా కాదు. ఎందుకంటే పూర్వ చారిత్రక యుగం నుంచీ ఉనికిని కాపాడు కుంటూ వస్తున్న అత్యంత మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం. మరోలా చెప్పాలంటే అది డైనోసార్లతో రాసుకుపూసుకు తిరిగిన బాపతు. అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట. అత్యంత కఠినమైన కాలపరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం? మనిషే.
అతని పేరాశ పుణ్యమా అని అంతరించిపోయే జాబితాలో చేరిన ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడేందుకు క్యూబా సైంటిస్టులు కాలంతో పోటీ పడి మరీ శ్రమిస్తు న్నారు...! అది క్యూబా తీరం వెంబడి పొడవుగా సాగిన ఉప్పునీటి కయ్యలోని జెప్టా చిత్తడి నేలల ప్రాంతం. ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకు తిరిగే భయానకమైన దోమలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.
డైనోసార్ల కాలంనుంచీ నేటిదా కా మనుగడలో ఉన్న ఒకే ఒక్క చేప జాతి అయిన మంజువారీలకు ప్రపంచంలోకెల్లా ఏకైక ఆవాసమది. పొ డవుగా, సన్నగా, నాజూకుగా, పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జాబితాలోని జీవజాలంలో ముందువరుసలో ఉంది. దాంతో పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాలూకు అంతరించను న్న జీవుల జాబితాలోకి ఎక్కింది. శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ సహస్రాబ్దం తొలినాళ్లకల్ల మంజువారీ దాదాపుగా అంతరించిపోయినంత పనైంది!
దాంతో ఒక దశలో దానిపై అంతా ఆశలు వదలుకున్నారు! కానీ ఉన్నట్టుండి మూడేళ్లకు అంటే 2003 ప్రాంతంలో జెప్టా చిత్తడినేలల్లో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది. దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది. దాన్ని ఎలాగైనా కాపాడేందుకు నడుం బిగించింది. ఈ గురుతర బా ధ్యతను అక్కడి ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రెస్ హర్టాడో బృందానికి అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. మంజువారీ చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేలల సమీ పంలోనే యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక హాచరీని ఏర్పాటు చేశారు. వాటి సంఖ్య హాచరీలో పట్టనంతగా పెరిగిన కొద్దీ పెద్ద వయసు చేపలను చిత్తడి కయ్యల్లోకి వదులుతూ వస్తున్నా రు.
ఇప్పుడు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ‘‘అప్పుడే ఆనందించడానికి లేదు. మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని. ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు. వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాతైనా బయట పడేయడం సాధ్యమని చెప్ప గలమన్నట్టు’’అని వివరించారాయన. క్యూబాలోని చేపల న్నింట్లోకెల్లా మంజువారీ రత్నం వంటిదని గర్వంగా చెబు తారు ఆంద్రెస్. అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


