అరుదైన ప్రాణులకు ఊపిరి | Reproduction of endangered species: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అరుదైన ప్రాణులకు ఊపిరి

Jun 17 2025 5:12 AM | Updated on Jun 17 2025 5:12 AM

Reproduction of endangered species: Andhra pradesh

అంతరించిపోతున్న జాతుల పునరుత్పత్తి 

జూలో 46 ప్రాణులకు జన్మనిచ్చిన వన్యప్రాణులు

ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది.

వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో విశాఖ నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్‌ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు ఊపిరిపోసుకున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి.  

అరుదైన జీవులకు అభయం 
విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్‌–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. 

జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్‌గై, రెడ్‌నెక్డ్‌ వాలబీ, బెంగాల్‌ ఫాక్స్, ఇండియన్‌ గ్రే వోల్ఫ్, రింగ్‌టైల్డ్‌ లెమూర్స్‌ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్‌క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్‌ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ ఘనత సాధ్యమైంది.

8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు 
గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్‌ గై–3, బార్కింగ్‌ డీర్‌–2, మౌస్‌ డీర్‌–1, బెంగాల్‌ ఫాక్స్‌–1, ఇండియన్‌ గ్రే వోల్ఫ్‌–1, అడవి దున్న (బైసన్‌)–1, రెడ్‌–నెక్డ్‌ వాలబీ–1, రింగ్‌టైల్డ్‌ లెమూర్‌–1 ఉన్నాయి.  

అంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. 
ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం..  
అడవి కుక్కలు(ఆసియాటిక్‌ వైల్డ్‌ డాగ్స్‌): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్‌–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. 

⇒  కృష్ణ జింక(బ్లాక్‌బక్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్‌–1 జాబితాలో ఉంది 

⇒ మూషిక జింక(మౌస్‌ డీర్‌): షెడ్యూల్‌–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్‌–1 జాబితాలో ఉంది. 

 కనుజు : ఇది కూడా షెడ్యూల్‌–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. 

⇒ నీలి ఎద్దు( నీల్‌గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్‌గై షెడ్యూల్‌–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్‌గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. 
⇒ రెడ్‌ నెక్డ్‌ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్‌నెక్డ్‌ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జని్మస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది.

వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు  
జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్‌ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న జాతుల సంతతి జూలో     గణనీయంగా పెరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది.  – జి.మంగమ్మ, జూ క్యూరేటర్‌

Advertisement
 
Advertisement
Advertisement