
ఇరాన్ సహా 12 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెద్ద షాకిచ్చారు. ఆ దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రాబోయే సోమవారం(జూన్ 9వ తేదీ) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
ఈ జాబితాలో ఇరాన్(Trump Travel ban on Iran), లిబియా, అఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా సైతం ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాలపైనా ఆయన తాత్కాలిక నిషేధం విధించారు. ఇందులో.. బూరుండి, వెనిజులా, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, టుర్కిమేనిస్తాన్ ఉన్నాయి.
ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండడం, అదే సయమంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండడం.. ఈ రెండు కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు అని వైట్హౌజ్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలో ఉండడం, ఇరాన్ క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తుండడం, చాద్.. ఎరిత్రియాలాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండడం.. లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ‘విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే’ అంటూ ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2017లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అయితే ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక 2021లో దానిని ఎత్తివేశారు.