Md Anwarul Azim Anwar: బెంగాల్‌లో బంగ్లా ఎంపీ హత్య | Bangladeshi MP Murdered In Kolkata | Sakshi
Sakshi News home page

Md Anwarul Azim Anwar: బెంగాల్‌లో బంగ్లా ఎంపీ హత్య

May 23 2024 5:03 AM | Updated on May 23 2024 5:03 AM

Bangladeshi MP Murdered In Kolkata

మృతదేహం కోసం కొనసాగుతున్న అన్వేషణ

కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. 

నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్‌ నేత   హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. 

కోల్‌కతాకొచ్చి కనిపించకుండాపోయి..
మే 12వ తేదీన ఎంపీ అన్వర్‌ నార్త్‌ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్‌ బిశ్వాస్‌ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉందని చెప్పి అన్వర్‌ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్‌ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్‌ ఫోన్‌ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్‌ చివరిసారిగా సంజీబ్‌ ఘోష్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్‌ రాలేదు.  అన్వర్‌ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్‌ అనుమానం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement