బలూచ్‌ కార్యకర్త మృతి.. పాక్‌పై అనుమానం | Baloch Activist Karima Baloch Found Dead in Canada | Sakshi
Sakshi News home page

బలూచ్‌ కార్యకర్త మృతి.. పాక్‌పై అనుమానం

Dec 22 2020 11:12 AM | Updated on Dec 22 2020 1:17 PM

Baloch Activist Karima Baloch Found Dead in Canada - Sakshi

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కార్యకర్త కరీమా బలూచ్‌(ఫైల్‌ ఫోటో)

టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్‌ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్‌షేర్‌ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్‌ సైన్యం, బలుచిస్తాన్‌ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్‌ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్‌ఐఎస్‌ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్‌ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్‌’ )

పాకిస్తాన్‌ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్‌ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్‌ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్‌ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్‌ఓ) మాజీ చైర్‌పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్‌ మూవ్‌మెంట్‌ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!)

ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీ​కి రక్షాబంధన్‌ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్‌లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement