
న్యూఢిల్లీ: నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన ‘మధ్యవర్తిత్వ న్యాయస్థానం’ ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్ ఒక ప్రకటనలో తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ, పాక్.. నెదర్లాండ్స్లోని హేగ్లో గల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ న్యాయస్థానం) ఆదేశాలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన చట్టవిరుద్ధ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని తాము అంగీకరించలేదని, అయినా అది భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము, కాశ్మీర్లోని కిషెన్గంగా , రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యంపై అనుబంధ అవార్డుగా వర్ణించే ఆదేశాల్ని ఇచ్చిందని పేర్కొంది.
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని, ఈ కోర్టు తీసుకునే చర్యలు, అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లదని భారత విదేశాంగశాఖ తేల్చిచెప్పేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత్.. అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ, పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం మున్ముందు ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యం తమ ఉనికిలో లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్