టోక్యో: జపాన్లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈశాన్య జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5:21 గంటలకు భూమికి 41 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
మరోవైపు, జంట తుపానుల తాకిడితో జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో ఇప్పటికే జపాన్ పశ్చిమ భాగంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతూండగా గోరుచుట్టుపై రోకటి పోటు చందంగా తుపానులు చుట్టుముట్టాయి. మెఖాలా తుపాను జపాన్ దక్షిణ భాగం చివరలోని అమామీ ద్వీపం తీరం దాటి టోక్యో వైపు దూసుకొస్తూండగా.. హిగో తుపాను కూడా ఈ దిశగానే ప్రయాణిస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఫలితంగా టోక్యోకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. క్యోటో, ఒసాకా తదితర పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నారా ప్రాంతంలో ఒక వ్యక్తి జలప్రవాహంలో పడటంతో గాయాలైనట్లు ఎన్హెచ్కే పబ్లిక్ టీవీ తెలిపింది. నారా, హిరోషిమా ప్రాంతంలో సుమారు 30 ఇళ్లు వరద ముప్పునకు గురయ్యాయని, విపత్తుల నివారణ సంస్థ అధికారులు తెలిపారు.


