ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఒమన్ గల్ఫ్లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్లోని సోహార్ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.
కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.


