పారిస్ : ఫ్రాన్స్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాల వెలికితీత చేపడుతున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ విమానం స్కైడైవింగ్ ట్రిప్కు వెళ్తున్న కొంతమంది వ్యక్తులతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభం కానుంది. అని కథనాలు ప్రచురించాయి.
పారాచూట్ స్కూల్కు చెందిన విమానం
ప్రమాదానికి గురైన విమానం ఒక పారాచూటిస్ట్ పాఠశాల కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు విమానంలో ఉన్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని స్థానిక ప్రిఫెక్చర్ (అధికార యంత్రాంగం) తెలిపింది. మరణించిన ప్రయాణికులలో ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు (శిక్షకులు) ఉన్నట్లు పేర్కొంది.


