
ఉద్యోగాలిప్పిస్తామని రూ.35 లక్షలు స్వాహా
సికింద్రాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసగించిన మహిళను, ఆమెకు సహకరించిన మరో నిందితుడిని సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్రావు, ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని నాచారంలో నసీమాబాను అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలన్న అత్యాశతో నసీమాబాను తన సోదరి ఫాతిమా ఇంకొందరి సహకారంతో తార్నాకలో ఓ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుని విదేశాలకు వెళ్లేందుకు వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. వీరి ప్రకటనలు చూసిన హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ఉద్యోగాలు చేసేందుకు, పాస్పోర్టులతో పాటు రూ.35 లక్షలు అప్పగించారు. నిర్ణీత సమయంలో వారికి వీసాలు రాలేదు. ఉద్యోగాలు ఇప్పించలేదు.
పాస్పోర్టులు, డబ్బులు అప్పగించిన వారినుంచి ఒత్తిడి రావడంతో నసీమాబాను నకిలీ వీసాలు, ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించి వారికి ఇచ్చింది. అసలు నిజం బయటపడటంతో పాస్పోర్టుదారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో ఆమె సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన టాస్క్ఫోర్స్ సౌత్జోన్ పోలీసులు నసీమాబానును, ఆమెకు సహకరించిన బేగంపేటకు చెందిన సయ్యద్ ఆదిల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. వాస్తవాలను వెల్లడించారు. ఇదే కేసులో భాగస్వాములుగా ఉన్న ఫాతిమా, రేఖ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మహిళ సహా మరో నిందితుడి అరెస్టు