వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత

Jun 20 2025 6:47 AM | Updated on Jun 20 2025 6:47 AM

వైద్య

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత

పోస్టుల భర్తీపై ఎన్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరో దారి

వైద్య విద్య, రోగులకు సేవలు, పరిశోధనలపై తీవ్ర ప్రభావం

గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, కేన్సర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో పని భారం

పరిశోధనలపై ఫోకస్‌ నిల్‌..

వైద్య కళాశాలల్లో బోధనతో పాటు రోగులకు అందించే వైద్య సేవలు, పరిశోధనలూ కీలకంగా ఉంటాయి. బోధనాస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోంది. పలు రకాల కమిటీల్లో సభ్యులుగా ఉండటం, పరిపాలనా విధులు అప్పగించడం వంటివి అదనపు భారంగా మారుతున్నాయని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. పరిశోధనలు చేపట్టే అవకాశమే లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పరిశోధనలు ప్రారంభించాలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడంలేదని ఆరోపిస్తున్నారు. 2023లో చివరిసారిగా నియామకాలు చేపట్టారు. అనంతరం రెండేళ్లు కావస్తున్నా ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదంటున్నారు. కొంత మంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.

సాక్షి, సిటీబ్యూరో:

నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, కేన్సర్‌, ఫీవర్‌ ఆస్పత్రులు ఆరోగ్య ప్రదాయినులుగా నిలుస్తున్నాయి. ఆయా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవల కోసం రిఫరల్‌ కేసులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యమున్న బోధనాస్పపత్రుల్లో టీచింగ్‌ స్టాఫ్‌ కొరత వేధిస్తోంది. పోస్టులు భర్తీ చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40 శాతం మంది వైద్యులు (టీచింగ్‌) పోస్టులు ఖాళీలు ఉన్నాయని సమాచారం. వైద్య కళాశాలకు అవసరమైన పోస్టులను జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కళాశాలతో కలిసి ఉన్న ఆస్పత్రి, అందులో పడకలు ఆధారంగా పోస్టులను కేటాయిస్తోంది. దీంతో ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఫలితంగా మెడికల్‌ కళాశాలల్లో బోధన సిబ్బంది సరిపడా ఉన్నారంటే ఉన్నారు. లేరంటే లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. సమర్థించుకునేవారు ఎన్‌ఎంసీ లెక్కలను చూపిస్తున్నారు. ఈ అంకెల ఆధారంగా చూస్తే కళాశాల అవసరాల కంటే ఎక్కువ మంది ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుతకేటాయింపులను పరిశీలిస్తే మాత్రం అసలు విషయం వెలుగుచూస్తోంది. రోగులకు అందే సేవలు, వైద్య విద్యార్థుల తరగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం పరిశోధనలపై ఫోకస్‌ చేసే అవకాశమే లేదని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.

వైద్య సేవలపై ప్రభావం..

నగరంలోని ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల్లో అత్యధిక శాతం మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం లేకుండాపోతోంది. బెడ్‌లు ఎక్కువ, వైద్యులు సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కొన్ని విభాగాల్లో ఒక్కరూ లేని పరిస్థితి. ఉదాహరణకు గాంధీ వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 147 మంది బోధన సిబ్బంది (ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు కేటగిరీలు కలిపి 330 మందికిపైగా సిబ్బందిని కేటాయించింది. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న వారు సుమారు 200 మంది ఉన్నారు. మిగతా 130 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 2 వేల పడకల ఆస్పత్రి ఉంది. నిత్యం వేలాది మంది ఓపీ, ఐపీ ఉంటుంది. ఉస్మానియా పరిధిలోని ఉస్మానియా, నిలోఫర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ సుమారు 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నారు. ఖాళీల ప్రభావం రోగులకు అందించే సరైన వైద్యం అందించే అవకాశం లేకుండాపోతోంది. రోగులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు సరైన బోధన అందుతోందా అంటే అదీ కష్టమే అంటున్నారు.

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత1
1/2

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత2
2/2

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement