
హైదరాబాద్: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు.
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది.