సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడటంతో వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఎర్రమ్మ తల్లి గుడి వద్ద కేఎల్ఆర్ కాలేజీకి చెందిన బస్సు శుక్రవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. కాలేజీ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కారణంగా విద్యార్థులు బస్సు కింద ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


