●కలిసికట్టుగా ముందుకు సాగుతాం
కొత్తగూడెంఅర్బన్: కార్పొరేషన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న బేదాభిప్రాయాల కారణంగా సీపీఐ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ ఎంతగానో అభివృద్ధి చెందనుందని, హైదరాబాద్ తర్వాత అంతటి విశిష్టత ఇక్కడ ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుందని, బడా కంపెనీలు ఇక్కడికి రావడంతో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో విమానాశ్రయం కూడా రానుందని తెలిపారు. సుపరిపాలన దిశగా ముందుకు సాగాలని నూతన పాలకవర్గానికి సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్, కార్పొరేటర్ల పనితీరు ఉంటుందని, ఈ మేరకు పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పారు. అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా కృషి చేయాలని పాలకవర్గాన్ని కోరారు.


