
స్పెషలైజ్డ్ పేరిట ప్రైవేటు ఏజెన్సీలకు పారిశుద్ధ్యం
‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్’ను ఆహ్వానించిన బల్దియా
గతంలోనూ టూరిస్టు ప్రాంతాల పేరిట నిధుల దుబారా
ఇప్పుడు ఇంకెవ్వరి జేబులు నింపుతారో?!
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్యక్రమాల పేరిట ఇప్పటికే ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తున్న జీహెచ్ఎంసీ.. తాజాగా పర్యాటక ప్రాంతాల్లో స్పెషలైజ్డ్ శానిటేషన్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలోనూ చార్మినార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాల్లో, బేగంపేట– బంజారాహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్యం పేరిట కోట్లు వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ప్రైవేటు ఏజెన్సీల పేరిట ఎవరి జేబులు నిండాయో కానీ, ఆ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించనప్పటికీ.. తిరిగి అదే చరిత్రను పునరావృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. స్పెషలైజ్డ్ ఏజెన్సీల పేరిట ఇప్పటికే సికింద్రాబాద్ జోన్లో రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వరకు, ఖైరతాబాద్ జోన్లోని మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో, చార్మినార్ జోన్లోని రెండు సర్కిళ్లలో టూరిస్టు ప్రదేశాలున్న వాణిజ్య ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల కోసమంటూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. మిగతా జోన్లలోనూ, మిగతా ప్రాంతాల్లో సైతం పిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పర్యాటకాభివృద్ధి కోసమట..
పారిశుద్ధ్య కార్యక్రమాలు సవ్యంగా లేకపోవడం పర్యాటకాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, వాణిజ్య మార్గాల్లో దుకాణాల వారు పడేసే వ్యర్థాలతో నగరాన్ని సందర్శించడానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశమున్నందున, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీల సేవలు కోరుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మూడు షిఫ్టులుగా పనిచేసే సిబ్బందితో 24 గీ7గా పారిశుద్ధ్యం బాగుండేందుకు తగిన సాంకేతిక నైపుణ్యం కలిగిన సంస్థలు తమ ప్రపోజల్స్ పంపాలని పేర్కొంది.
అయ్యే పనేనా?
ఆయా రోడ్లపై కాగితాలు, చెత్త, పూడిక, కూల్చివేతల వ్యర్థాలు, రాళ్లతో సహా నిర్మాణ రంగంలోని వ్యర్థాలు 24 గంటల పాటు ఏ సమయంలోనూ కనిపించకుండా ఉండాలని నిబంధనల్లో పేర్కొంది. ఇందుకుగాను మొదటి షిఫ్టులో ప్రతి 300 మీటర్లకు, రెండో షిఫ్టులో ప్రతి 500 మీటర్లకు ఒక స్వీపింగ్ వర్కర్తో పాటు ప్రతి వెయ్యి మీటర్లకు కాగితాలు ఏరివేసేందుకు ఒక కార్మికుడు, ప్రతి రెండువేల మీటర్లకు ఒక సూపర్వైజర్ ఉండాలని పేర్కొంది. పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించేందుకు తగిన వాహనాలు, యంత్రాలు ఉండాలని తెలిపింది. రోడ్లతోపాటు ఫుట్ఫాత్లు, సెంట్రల్ మీడియన్లు సైతం తళతళలాడాలని సూచించింది. ఇలా ఎన్నో నిబంధనలు విధించింది. అంతేకాదు, స్వచ్ఛమైన తాగునీరు, పబ్లిక్ టాయ్లెట్లను కూడా యూజర్ చార్జీలు తీసుకొని నిర్వహించాలట. గత అనుభవాలు తెలిసిన వారికి మాత్రం ఇది అమలయ్యే కార్యక్రమంగా కనిపించడం లేదు. తొలుత మూడేళ్ల వ్యవధి వరకు ఉండే ఒప్పందం పని తీరును బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. ఏడాదికి కిలోమీటరుకు దాదాపు రూ.30 లక్షలు చెల్లిస్తారు.
పాత తరహాలోనే..
ఎన్ఎఫ్సీఎల్–కేబీఆర్ పార్కు, రోడ్ నెంబర్ 45 – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మ గుడి –నీరూ జంక్షన్, రోడ్నెంబర్ 12– కేబీఆర్పార్క్, కేబీఆర్పార్క్–జగన్నాథ ఆలయం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్– పెద్దమ్మ గుడి, రోడ్ నెంబర్ 45– అగ్రసేన్ విగ్రహం, ఎన్ఎఫ్సీఎల్– విరించి హాస్పిటల్తో పాటు ఆయా సర్కిళ్లలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు స్పెషలైజ్డ్ ఏజెన్సీలను ఆహ్వానించారు.