పాఠశాలలపై పోలీసుల నజర్‌ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలపై పోలీసుల నజర్‌

Jun 20 2025 6:47 AM | Updated on Jun 20 2025 6:47 AM

పాఠశాలలపై పోలీసుల నజర్‌

పాఠశాలలపై పోలీసుల నజర్‌

డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్‌, ట్రాఫిక్‌ సిబ్బందితో

ప్రత్యేక బృందాల ఏర్పాటు

ట్రాఫిక్‌, వాహనాలక్రమబద్ధీకరణ వీరి బాధ్యత

ప్రతి స్కూల్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి

సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టారు. బడి బస్సుల ఫిట్‌నెస్‌ మొదలు యాజమాన్యం, డ్రైవర్ల పనితీరు తదితర అంశాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాల విద్యార్థుల భద్రతపై సిటీ పోలీసులు రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ప్రతి స్కూల్‌ బస్సు అనుమతులు, సీటింగ్‌ సామర్థ్యం, పాఠశాలల పేరు, నంబరు, డ్రైవర్‌ అనుభవం తదితర వివరాలను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. అజాగ్రత్త కారణంగా గత మూడేళ్లలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని సీపీ గుర్తు చేశారు. విద్యార్థులు పాఠశాల బస్సులలోనే ప్రయాణించేలా చూసుకోవాలని, ప్రతి పాఠశాలలో బస్సు భద్రతలపై యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పిల్లలకు ఎలాంటి సమస్య ఎదురైనా యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డ్రోన్లతో నిఘా..

ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ.. నగరంలో రోజూ 90 లక్షల పైగా వాహనా లు తిరుగుతున్నాయని, 3 వేల మంది సిబ్బందితో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లలో 8 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. త్వరలో పాఠశాలల వద్ద డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, పాఠశాలల పరిసరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ యాజమాన్యాల బాధ్యత అని స్పష్టం చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి యాజమాన్యాలు సెక్యూరిటీ, ట్రాఫిక్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో ఎక్కించుకోకూడదని, దీనిని పోలీసుల బాధ్యతగా వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రైమరీ స్కూల్‌, హై స్కూళ్ల సమయాల్లో మార్పులు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. వీరికి 25 సంవత్సరాల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రాదని హెచ్చరించారు. ఇప్పటివరకు 766 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సీసీ కెమెరాలు తప్పనిసరి..

ప్రతి పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని, వాటి నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రైవర్లు పిల్లలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పరిసర ప్రాంతాలను గమనించాలని, అక్కడే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క విద్యార్థి చనిపోయినా పాఠశాలకు పెద్ద సమస్యగా మారుతుందన్నారు. పిల్లలు పాఠశాలలకు ఓవర్‌ లోడెడ్‌ ఆటోల్లోనూ వెళ్తున్నారని, అలా వెళ్లడం వల్ల ప్రమాదాలు, మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని, వీటిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు. యాజమాన్యాలు పాఠశాల పరిసర ప్రాంతాలలో సైన్‌ బోర్డు ఉండేలా చూసుకోవాలని, ఒకే ప్రాంతంలో ఎక్కువ పాఠశాలలు ఉన్నప్పుడు ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో రవాణా, ట్రాఫిక్‌ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషననల్‌ కమిషనర్‌ గోపాల్‌, జేటీసీ రమేష్‌ డీఈఓ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement