
కెమెరాలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ మోసం
బంజారాహిల్స్: ఈవెంట్లలో ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్లను పరిచయం చేసుకుని ఖరీదైన కెమెరాలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ నమ్మించి డబ్బులు దండుకుంటున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్లో నివసించే సూరజ్ ధనాల ఈవెంట్లలో డీజే ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. తాను వెళ్లే ఈవెంట్లలో అక్కడి ఫొటోగ్రాఫర్లను పరిచయం చేసుకుంటూ ఇంతకంటే మేలైన, నాణ్యత ఉన్న, అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఉన్న కెమెరాలను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఇలా వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో 24 మందిని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సూరజ్ ధనాలను బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇలా అడ్డదారుల్లో వసూలు చేసిన డబ్బును నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్లలో పెట్టేవాడని దర్యాప్తులో తేలింది. బెట్టింగ్లకు బానిసైన సూరజ్ ఈజీ మనీ కోసం ఫొటోగ్రాఫర్లకు వలవేస్తూ తక్కువ ధరకే కెమెరాలు ఇప్పిస్తానంటూ నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసేవాడు. గత ఏడాది గజ్వేల్ పోలీసులు ఇదే తరహా చీటింగ్ కేసులో నిందితుడిని రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత కూడా సూరజ్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఇలాంటి మోసాలకు తరచూ పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 24 కేసులు నమోదయ్యాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.