
పార్థీ గ్యాంగ్!
పంథా మార్చిన
సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నేరాలు
● ఒకప్పుడు దోపిడీలు, బందిపోటు దొంగతనాలు
● నగరంలో వీళ్లు చేసిన హత్యలు, దారుణాలు ఎన్నో
● ప్రస్తుతం గంధపు చెట్ల స్మగ్లింగ్ వైపు మళ్లిన గ్యాంగ్స్
● తాజాగా నలుగురిని అరెస్టు చేసిన సిటీ పోలీసులు
● పరారీలో ఉన్న 19 మంది కోసం ముమ్మరంగా వేట
సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్లోని నుంచి వచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంధపు చెట్లను నరికి ఎత్తుకుపోతున్న పార్థీ గ్యాంగ్ను నగర పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న మరో 19 మంది కోసం గాలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలు చేసిన పార్థీ గ్యాంగ్ ప్రస్తుతం తన పంథా మార్చింది. అత్యంత కరుడుగట్టిన ఈ ముఠా పేరు చెప్తే ఒకప్పుడు పోలీసులే హడలిపోయే వాళ్లు. దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, సొత్తు కోసం హత్యలు, అత్యాచారాలు చేసిన ఈ గ్యాంగ్స్ ప్రస్తుతం గంధపు చెట్లపై పడ్డాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ల్లో విస్తరించి ఉన్న పార్థీ గ్యాంగ్స్లో మూడు రకాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అవే పాసి పార్థీలు, పన్ పార్థీలు, గ్రామ్ పార్థీలు... వీటిలో పన్, గ్రామ్ ముఠాలు అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు.
పగలు రెక్కీ... రాత్రికి పంజా...
పార్థీ గ్యాంగ్స్ కొన్నేళ్ల క్రితం వరకు శివార్లలో ఒంటరి ఇళ్లు, ఫామ్హౌస్ల్ని ఎంచుకుని క్రూరంగా బందిపోటు దొంగతనాలకు పాల్పడేవి. అడవుల్లో వేటాడేప్పుడు క్రూరమృగాలపై ఎలా దాడి చేస్తారో... దోచుకునే సమయంలో మనుషుల పైనా అదే స్థాయిలో వీళ్లు విరుచుకుపడేవారు. బాధితుల్ని తీవ్రంగా గాయపరచడం, ఎదిరిస్తే హతమార్చడం వారి నైజం. నిర్మానుష్య ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని నివసిస్తూ..పగలు ప్లాస్టిక్ సామాన్లు, పూసలు అమ్ముకునే వారిగా వీధుల వెంట తిరిగేవాళ్లు. అనువైన ఇంటిని ఎంపిక చేసుకుని అర్ధరాత్రి దాటిన తరవాత దానిపై విరుచుకుపడి విలయం సృష్టించే వాళ్లు.
ఆ కాలం నుంచి ‘క్రిమినల్ ట్రైబ్’ ముద్ర...
బ్రిటీష్ కాలంలో ఉత్తరాదికి చెందిన పార్థీ గ్యాంగ్స్ను క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ కింద నోటిఫై చేశారు. అప్పట్లో వీళ్లు కేవలం నేరాలు మాత్రమే చేస్తుండటంతో ఇలా చేసి వారిపై పటిష్ట నిఘా ఉంచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం పార్థీలకు జీవనోపాధి కల్పించడంతో దాదాపు 99 శాతం మంది తమ జీవనశైలి మార్చుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని ముఠాలు నేరాలు చేయడమే తమ జీవనాధారంగా చేసుకున్నాయి. ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన ముఠాలకు గణేష్ బాపు రావు పవార్ దలే నాయకుడిగా ఉండేవాడు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పేరున్న ఇతనిపై సైబరాబాద్తో పాటు మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతన్ని 2005లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. ఆపై 2011లో సైబరాబాద్ పోలీసులే ఇతని సోదరుడు రాహుల్ బాపురావు పవార్ను పట్టుకున్నారు.
వేసవి కాలంలోనే ఎక్కువగా...
ఈ ముఠాలు అప్పట్లో వేసవి కాలంలోనే సైబరాబాద్పై విరుచుకుపడేవి. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందని పోలీసులు చెప్తున్నారు. పార్థీలు ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో కొండ ప్రాంతాల్లో ఉన్న తమ స్వస్థలాల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారు. డిసెంబరు నెల నుంచి దొంగతనాలు ప్రారంభించేవారు. ముందుగా మహారాష్ట్రలో, ఆపై గుజరాత్ల్లో నేరాలు చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడకు చేరే సరికి మార్చి, ఏప్రిల్ వచ్చేది. అలా ఆగస్టు వరకు ఇక్కడ నేరాలు చేసి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించి..మళ్లీ సెప్టెంబరు వచ్చేసరికి తమ స్వస్థలాలకు చేరుతుండేవారు. ఒక్కోసారి ఈ పార్థీ ముఠాలు సీజన్ను మారుస్తూ నవంబరులోనూ నగరంపై పడి రెచ్చిపోయేవారు. పోలీసుల్ని ఏమార్చడానికి ఈ ఎత్తు వేసేవారని అధికారులు చెప్తున్నారు.
ఆ గ్యాంగ్స్ ‘పని’ చేసేది ఇలా...
శివార్లలో ప్రవేశించి నిర్జన ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని నివస్తారు. రాహుల్ బాపురావు పవార్ ముఠా అప్పట్లో లింగంపల్లిలో మకాం పెట్టింది. పగలు గ్యాంగ్లోని మహిళలతో రెక్కీ నిర్వహించేవారు. అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఇళ్ళను ఎంచుకుని అర్ధరాత్రి విజృంభించి బందిపోటు దొంగతనాలకు పాల్పడేవారు. దోపిడీలకు సైతం శివార్లలోని ఒంటరిగా ఉన్న ఇళ్లనే ఎంచుకునేది. సాధారణంగా ఈ ముఠా ఎలాంటి ఆయుధాల్నీ తమతో తెచ్చుకోదు. బందిపోటు దొంగతనం చేయబోయే ఇంటి ఆవరణలో, ఇంట్లో చేతికి దొరికిన వస్తువుతో పాశవికంగా దాడి చేస్తుంది. ఆ సమయంలో సాధారణంగా బాధితులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. తొలుత బాధితుల్ని గాయపరచడం ద్వారా భయభ్రాంతులకు గురిచేసి..ఆపై సొత్తు చేజిక్కించుకోవడం వీరి నైజం. వీళ్లు ఎక్కువగా బాధితుల తలపైనే దాడి చేసేవారు. 2001లో నాగోలులోని కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో వీరు సృష్టించిన విలయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.