
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
హిమాయత్నగర్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం ఎస్ఐ షఫీ తెలిపిన వివరాల ప్రకారం నారాయణగూడ విఠల్ వాడికి చెందిన ఆటో డ్రైవర్ డి.కోటేశ్వర్(50) ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 10న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి సోదరుడు డి.పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్రం వెంటనే
కులగణన చేపట్టాలి
హయత్నగర్: స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఏ వర్గం వారి జనాభా ఎంత ఉందో లెక్కలు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల మాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన పార్టీ కుంట్లూరు శాఖ మహాసభలో వారు మాట్లాడారు. కేంద్రం తక్షణం స్పందించి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా అందజేయాలన్నారు. పార్టీ మండల సహాయ కార్యదర్శి ఆజ్మీరా హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యుడు చిర్ర శేఖర్, నాయకులు గణేశ్, పేరాల గోపి, సైదులు, అనసూయ, రాజు, రవళి తదితరులు పాల్గొన్నారు.