
గత పాలకుల వల్లే విద్యా వ్యవస్థ నిర్వీర్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని, అందుకు కారణం గత పాలకుల వైఫల్యమేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. తెలంగాణ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం–ఆంధ్ర కార్పొరేట్ దోపిడీ’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ఏ ఉన్నత విద్యా సంస్థలోనూ విద్యా ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలలన్నీ వ్యాపార దృక్పథంతో నడుస్తున్నాయని, దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. నడవని కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని చెప్పారు.
● విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని అప్పుడే వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో చదివే పిల్లలే నీట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయన్నారు. సీఎం రేవంత్రెడ్డికి విద్యా వ్యవస్థను బాగుపరచాలనే సంకల్పం ఉందని, దానికి పౌర సమాజం కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, పల్లె వినయ్కుమార్, ఇర్వేంటి విజయ్కుమార్, ఆర్.వెంకట్రెడ్డి, అశోక్రెడ్డి, కిరణ్, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం