
బడి గంట మోగినా.. బండి బాగుపడలే..
గ్రేటర్ పరిధిలో 1,825 బడిబస్సులు ఫిట్‘లెస్’
సాక్షి, సిటీబ్యూరో: బడులు తిరిగి తెరుచుకొనే నాటికి సామర్థ్యం ఉన్న బస్సులను అందుబాటులో ఉంచాలనే నిబంధన మరోసారి ఉల్లంఘనకు గురైంది. సామర్థ్యంలేని బస్సులు వందల సంఖ్యలో రోడ్డెక్కాయి. స్కూల్ బస్సుల నిర్వహణపై రవాణాశాఖ ఆంక్షలు విధించినా.. కొన్ని విద్యాసంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. గురువారం గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో సామర్థ్యం లేని 40 బస్సులను జప్తు చేసినట్లు రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. ఫిట్నెస్ లేకుండా తిరిగే బస్సులను జప్తు చేయడంతో పాటు భారీ జరిమానాలను సైతం విధిస్తామని ఆయన హెచ్చరించారు.
ఏటా.. ఏదో ఒక చోట..
● ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకం కావడంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఉంటోంది. వాహనాలు నడిపే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
● మరోవైపు బస్సు బయటి వైపు వెనుక, ముందు గమనించకుండా ముందుకు కదిలించడం వంటి ఘటనల్లోనూ చిన్నారులు బలవుతూనే ఉన్నారు. మరోవైపు నగర శివార్లలోని పలు విద్యాసంస్థలకు చెందిన వాటిలో కాలం చెల్లిన బస్సులే ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని పిల్లల కోసం వినియోగిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ఫిట్నెస్ లేనివి 1,825 బస్సులు ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 13,552 బస్సులు ఉండగా వాటిలో ఇప్పటి వరకు 11,727 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
సామర్థ్యం లేనివాటిపై రవాణా శాఖ కొరడా
నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
మొదటి రోజు 40 బస్సులు జప్తు
ప్రత్యేక బృందాలతో యంత్రాంగం నిఘా