
నడుస్తున్న కారులో అగ్ని కీలలు
రాజేంద్రనగర్: నడుస్తున్న కారు ఇంజిన్లోంచి పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. వాహనాన్ని పక్కకు నిలిపి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పై మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఉదయ్ కుమార్ తన మారుతీ సుజుకీ కారులో ఆరాంఘర్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైనుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. ఫ్లై ఓవర్ 211వ పిల్లర్ వద్దకు రాగానే వాహనం ముందు భాగంలోని ఇంజిన్లోంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఉదయ్ కుమార్.. పక్కకు ఆపి పరిశీలిస్తుండగా మంటలు చెలరేగి వాహనం మొత్తం అలుముకున్నాయి. నిమిషాల వ్యవధిలో కారు మంటల్లో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఫ్లై ఓవర్పై ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.