రాత్రి మిస్సింగ్‌.. తెల్లారేసరికి శవమై | - | Sakshi
Sakshi News home page

రాత్రి మిస్సింగ్‌.. తెల్లారేసరికి శవమై

Feb 15 2024 7:08 AM | Updated on Feb 15 2024 12:49 PM

- - Sakshi

బంజారాహిల్స్‌: అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దుర్గాభవానీనగర్‌ బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌–5లోని దుర్గాభవానీనగర్‌ బస్తీకి చెందిన మునావత్‌ కార్తీక్‌ (10) సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఆడుకునేందుకు వెళుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్‌, కవితకు చెప్పి బయటికి వెళ్లాడు.

అతను తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. కాగా బుధవారం ఉదయం సమీపంలోని జీహెచ్‌ఎంసీ పార్కులోని నాలాలో కార్తీక్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడు ఎలా మృతి చెందాడనే విషయమై దర్యాప్తు చేపట్టారు.

వరదనీటి కాలువ పైకప్పు లేకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెంది ఉంటాడా? ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. రాత్రి అదృశ్యమైన కుమారుడు తెల్లారేసరికి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement