బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు
ముగిసిన ఫీజు దీక్ష...వైద్యులు, పార్టీనేతల సూచనలతో విరమణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల కోసం తన నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం తన మొండివైఖరి వీడి రూ. 15 వేల కోట్ల బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని, విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థి లోకానికి, యువతకు, మేధావులకు, విద్యాసంస్థల ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మంగళవారం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండురోజుల నిరాహారదీక్షను ఉపసంహరించిన సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు. మంగళవారం దీక్షా శిబిరానికి వచ్చిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి రక్తపోటు, చక్కెరస్థాయిలు తగ్గాయని గుర్తించారు. నిరాహార దీక్ష ను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతల చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు.
ఈ సందర్భంగా ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది యూపీఎస్సీ తరహాలో క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? రాహుల్ గాంధీ దీనిపై తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘రేవంత్ను సీఎంను చేసినందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. భూములు అమ్మితే వచ్చిన వేల కోట్లు ఏం చేస్తున్నావు?.. పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి మనసు రావడం లేదా ? విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా బాధ్యత రేవంత్రెడ్డిదే’అని హెచ్చరించారు. ‘
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆశల మీద నీళ్లు చల్లావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయిలేని సీఎంను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’అన్నారు. ఎమ్మెల్సీలు డా.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, టి.వీరేందర్గౌడ్, ఎన్వీ సుభాష్, గణేష్ కుండే, పి.మురళీధర్రావు, ఇ.పెద్దిరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సైదిరెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్రావు, జి.మనోహర్రెడ్డి, బండా కార్తీకరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడి పాల్గొన్నారు.
5, 6 తేదీల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు: ఏలేటి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ముఖ్యమైన సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా...వచ్చేనెల 5, 6 తేదీల్లో బీజేపీ ఆధ్వ ర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రకటించారు. భూభా రతి అక్రమాలు, 22ఏ పేరుతో లక్షలాది ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, తదితర సమస్యలపై సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు.
అప్పటికీ ప్రభు త్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయకపతే, భూ కుంభకోణాలపై చర్యలు తీసు కోకపోతే బీజేపీ పక్షాన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభరోజైన 7న ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి అమెరికాలో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతి పేరుతో దారుణమైన దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు.


