● గిరిజన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణం ● సీఐపై గుంటురు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు
నగరంపాలెం: డైభ్బె ఏళ్లు పైబడిన గిరిజన మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐను విధుల నుంచి డిస్మస్ చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్నాయక్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి వినతిపత్రం అందించారు. మట్రా జాలమ్మపై సీఐ ప్రవర్తించిన తీరుని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వడిత్యా శంకర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఆరున బాపట్ల జిల్లా ఆదినారాయణపురంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారని అన్నారు. ఈ క్రమంలో 70 ఏళ్లు పైబడిన గిరిజన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మట్రా జాలమ్మపై బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. సీఐ మాట్లాడిన మాటలు మా ఆత్మలు క్షోభిస్తున్నాయని, మనసులు కలిచివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత వృద్ధురాలి నుంచి స్వయంగా వాంగ్మూలం నమోదు చేయాలని కోరారు. ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ, వీడియో రికార్డులు, పోలీసుల విధి నిర్వహణ వివరాలు, ఇతరత్రా ఆధారాలను భద్రపరిచి పరిశీలించాలని కోరారు. విచారణ ముగిసే వరకు బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఐజీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఆమె పట్ల ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారని పేర్కొన్నారు. ఐజీని కలిసిన వారిలో నాయకులు రామావతు అంజినాయక్, హరిలాల్ నాయక్, పాండు నాయక్, కె.ఆనంద్, ఇ.హనుమంతునాయక్, పి.గోవర్ధన్ ఉన్నారు.


