వీరిని ఓ కంట కనిపెట్టాలి
క్షణికావేశంతో జీవితాలు బలి చేసుకోవద్దు
ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారిని ముందస్తుగా గమనించాలి
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువ. కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
డేంజర్ బెల్స్..
వ్యక్తులు డల్గా ఉండటం, ఎవరితో కలవకుండా మూలన ఒంటరిగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, బరువు తగ్గిపోవడం, ముఖం దిగాలుగా ఉండటం, ఆహారం మానివేయడం, తదితర లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై వారికి మానసిక వైద్యులచేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈలక్షణాలు కనిపించేవారు హైరిస్క్ గ్రూపునకు చెందిన వారు.
కారణాలు....
భారతదేశంలో ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు బానిసలవ్వటం, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో అపజయాలు, ఒత్తిడి, కుంగుబాటు, ఆర్ధిక సమ్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, పేదరికం, అక్రమ సంబంధాలు, కుల,వర్గ వివక్షలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
జీజీహెచ్లో బాధితుల వివరాలు...
గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి చికిత్స పొందినవారు ప్రతినెలా 30 మందికిపైగా ఉంటున్నారు. జీజీహెచ్ వైద్యులు, మానసిక వైద్య నిపుణులు వీరిలో పలువురికి కౌన్సెలింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. ప్రతిఏడాది 200 నుంచి 300 మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వారు జీజీహెచ్కు వస్తుండగా, కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
సామాజిక మాధ్యమాలలో, వార్తా పత్రికల్లో, ఆత్మహత్యలు జరిగే విధానాన్ని అన్వేషించేవారిని, విచారం, దిగులు, దుఃఖం, ఎక్కువ కాలం ఉంటే అది ఆత్మహత్యకు దారి తీసే అవకాశముంది. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా సడన్గా శాంతంగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తుంటే తేడాను గమనించాలి. గతంలో లాగా స్నేహితులతో కలవకుండా, ఆట పాటల్లో పాల్గొనకుండా, దైనందిన కార్యక్రమంలో నిరాసక్తతతో ఒంటరి తనంగా వుండడానికి ఇష్టపడుతుంటే ఆ మార్పును ఆత్మహత్యకు సంకేతంగా పరిగణించాలి. మాటల్లో, సంభాషణల్లో నైరాశ్యం కనబరుస్తూ, వస్త్రధారణలో, వ్యక్తిగత శుభ్రతలో, ఆకర్షణలో నిరాసక్తత, వ్యక్తపరుస్తుంటే వారితో తప్పనిసరిగా వారితో మాట్లాడి వారి బాధను ఆలకించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.


