రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యాన ఆదివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజంలో విద్యావ్యాప్తికి ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్పీఎల్టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పయర్థ నాగయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైందని, తమ సంస్థ ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. 110 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను సత్కరించి, పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మలినేని విద్యాసంస్థల అధినేత మలినేని పెరుమాళ్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాల తెలుగు సహచార్యులు డాక్టర్ బూసి వెంకట స్వామి, ఏపీ రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు, కాటూరి హైస్కూల్ డైరెక్టర్ కాటూరి వెంకటేశ్వరరావు, ఎస్పీఎల్టీవో కార్యదర్శి ఎం.రాకేష్, పాఠశాల అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, జాతీయ సమన్వయకర్తలు పి.రాజారత్నకుమార్, లేళ్ల కోటేశ్వరావు, జాతీయ ఉమెన్స్ సమన్వయకర్త దాసరి నాగమణి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఆర్.రాము పాల్గొన్నారు.
48 గంటల్లో బాలికను
పట్టుకున్న పోలీసులు
లక్ష్మీపురం: సాంకేతిక పరిజ్ఞానంతో 48 గంటల వ్యవధిలో బాలికను పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన ఆదివారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్తంభాలగరువు సాయినగర్కు చెందిన కాసిమళ్ల నారాయణ వద్ద మనవరాలైన బాలిక పెరుగుతుంది. బాలిక ఇంటి దగ్గరలోని డ్రై క్లీనింగ్ షాప్లో పనిచేస్తోంది. ఆగస్టు 31వ తేదీ సా యంత్రం 07.30 గంటలకు తన ఇంటిలోని చెత్త పారేసివస్తానని తాతయ్యకు చెప్పి బయ టకు వెళ్లిన అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. నారాయణ చుట్టు పక్కల ఎంత గాలించినా కనిపించకపోవడంతో ఈనెల 3వ తేదీన పట్టాభిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో బాలిక ఇంటి నుంచి విజయవాడ వెళ్లి అక్కడ నుంచి వైజాగ్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక వైజాగ్లో ఉన్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం వైజాగ్ వెళ్లి బాలికను గుంటూరు తీసుకు వచ్చారు. వెస్ట్ తహసీల్దార్ కిరణ్కుమార్ సమక్షంలో బాలికను నారాయణకు అప్పగించారు. బాలిక ఆచూకీని గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


