చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరింది. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్క భాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని సాక్షి దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం వెలువడింది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ రోజు ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పిన పెను ప్రమాదం
హెవీ లోడ్తో వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించటంతో బలహీనంగా ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం. త్రుటిలో లారీకి పెను ప్రమాదం తప్పింది. లారీ సహా కాలువలో పడి ఉండే ప్రాణనష్టం జరిగి ఉండేది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కూలిన వంతెన కొంత భాగం వద్ద అధికారులు ప్లాస్టిక్ బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెనపై ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు ప్రయాణిస్తున్నా అధికారులు స్పందించడం లేదు.


