14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి నెల్లూరు జైలుకు తరలింపు
గుంటూరు లీగల్: నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో బోనబోయిన శ్రీనివాస్యాదవ్ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ–2 నిందితుడు కేశన వెంకటేష్ శుక్రవారం మొబైల్ కోర్టు జడ్జి వి.దీప్తి ఎదుట లొంగిపోయారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల నిమిత్తం వెంకటేష్ను గుంటూరు జీజీహెచ్కు పోలీసులు తరలించారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తీసుకెళుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న నరేంద్ర ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నా ఇప్పటి వరకు కోర్టులో హాజరు పరచలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
జిల్లా కోర్టులో బోనబోయిన హల్చల్
లక్ష్మీపురం: జిల్లా కోర్టులో జనసేన పార్టీ నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటు అతడి అనుచరులు కోర్టులో హల్చల్ చేశారు. శుక్రవారం కోర్టులో కేశన వెంకటేష్కు చెందిన న్యాయవాది ప్రకాష్రెడ్డి కోర్టులో లొంగిపోతున్నట్లు న్యాయమూర్తి ముందు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ తన అనుచరులు సుమారు 50 మందికిపైగా రౌడీమూకలను వెంట పెట్టుకుని జిల్లా కోర్టుకు చేరుకున్నాడు. కోర్టు వద్ద బోనబోయిన ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో బోనబోయిన చిన్నగా అక్కడ నుంచి అనుచరులను తీసుకుని జారుకున్నారు.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని..
బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులు కోర్టు వద్ద ఉన్నట్లు కేశన వెంకటేష్, అతడి న్యాయవాదికి సమాచారం తెలిసింది.దీంతో కోర్టు ఆవరణలోనే ఓ కారులో వెంకటేష్ను దాచి పెట్టారు. కోర్టు ప్రాంగణంలో ఎటువైపు వెళ్లినా బోనబోయిన అనుచరులు ఉండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని న్యాయమూర్తి ముందు హాజరయ్యేందుకు ఎదురు చూశారు. సుమారు మూడు గంటల తరువాత బోనబోయిన కోర్టు ఆవరణను వదిలి బయటకు వెళ్లిన మరుక్షణమే న్యాయవాది ప్రకాష్రెడ్డి, కేశన వెంకటేష్ను మొబైల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నెల్లూరు జైలుకు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


