ద్రావణాగ్ని సాక్షిగా... మరణ వాగ్మూలం! | Vizag Steel Plant Accident Victim Tragedy | Sakshi
Sakshi News home page

బాగా చదువుకో... అమ్మ జాగ్రత్త!

Jun 11 2026 1:22 PM | Updated on Jun 11 2026 1:31 PM

Vizag Steel Plant Accident Victim Tragedy

అభిప్రాయం

‘...బాబూ వర్మా, తమ్ముడిపై కోప్పడకు. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను బాగా చూసుకోండి... ఇక ఉంటాను’– 1540 డిగ్రీల వేడిలో మరిగిన ఉక్కు ద్రావణం మీద పడటంతో శరీరమంతా కాలిపోయిన ఓ కార్మికుడు స్ట్రెచర్‌ మీద, చావుబతుకుల మధ్య కుటుంబాన్ని తలుచుకొని పెద్ద కొడుకుకి చెప్పిన సూచనలివి. ఇది మొబైల్‌లో రికార్డయి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలామందిని కలచి వేస్తోంది.  

మరిగిన ఉక్కు ద్రవంలో దేహాలు కూడా కరిగిపోయి ఎనిమిది మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా కాలిన శరీరాలతో ఆసుపత్రుల్లో ఉన్నారు. ఇక షరా మామూలే... సంతాప ప్రకటనలు, పరిహార ప్రకటనలు. కానీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగు తున్నాయి, ఏ భద్రతా చర్యల లోపాల వలన జరుగుతున్నాయి. దీనికి బాధ్యులెవరు? భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత ప్రమాద నివారణ గురించిన చింతనగానీ, చర్యలుగానీ కనపడటం లేదు.

అంచేత మృత్యుముఖంలో ఉన్న ఆ కార్మికునికి ఈ ఎరుక ఉండే, తన అంతిమయాత్ర సమయం ఆసన్నమయిందన్న విషయం గ్రహించి... తాను ఎలాగూ నిర్లక్ష్య, బేఖాతర్‌ అధికార్ల, నేతల వలన బలి అయిపోతున్నాడు కదా, తన కొడుకులు ఇలా బలి కాగూడదు అను కున్నాడు. తన కుటుంబం బలి కాగూడదు అనుకున్నాడు. అందుకు జాగ్రత్తలు చెప్పాడు పెద్ద కొడుక్కి. ఇవి కేవలం కొడుకుకే చెప్పిన మాటలేనా? కుటుంబం కోసం పడ్డ తాపత్ర యమేనా?

ద్రావణాగ్ని సాక్షిగా...
అంతిమ క్షణాల్లో గుండెలో ఇంకెన్నో కదలాడి ఉంటాయి. ఆ ప్లాంట్‌ పరిరక్షణ కోసం, మరింత సమర్థవంతంగా కర్మాగారం పని చేయడం కోసం, ఆ కర్మాగారం తమ ఉపాధి గృహం అన్న భావనతో ఏళ్ల నుంచి అధికార పీఠాలకు తాము చేసిన విన్నపాలు, అధికార పీఠాలు అమలు చేసే మృత్యు శాసనాలు, వాటిని ధిక్కరిస్తూ అనునిత్యం చేసిన చట్టబద్ధ పోరాటాలు, ప్లాంట్‌ను కాపాడే కర్తవ్యాలను నిర్వహించడం గురించి తన పెద్ద కొడుక్కి చెప్పాలని భావించే ఉంటాడు. అధికారంలో ఉన్న పార్టీ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టడం, తాము వ్యతిరేకిస్తూ పోరాడటం గురించి చెప్పాలని అనుకునే ఉంటాడు. అధికార పక్షంలో ఒకరు ఓసారి అమ్మకం ఆగదంటారు, మరొకరు ఆగిపోయినదంటారు. ఇంకొకరు మావల్ల ఆగిందంటారు (బాధితుల పరామర్శకు వచ్చినపుడు ఒక నాయకుడి పలుకులు ఇవే). ఇంకొకరు ఇదిగో సహాయం అని భిక్షపు నూకలు వేసి డప్పు కొట్టుకోవడం – అందరివీ అబద్ధపు కూతలే అని కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు.  

చ‌ద‌వండి: ఇది స‌ర్కారీ నిర్ల‌క్ష్యం!

ఉక్కు కర్మాగారం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి గురించీ, భూములు కోల్పోయిన వారి గురించీ, ప్రభ్యుత్వం ఈ కర్మాగారం మీద పెట్టిన పెట్టుబడికి కొన్ని వందల రెట్ల ఆదాయం కార్మికులు తమ శ్రమ ధారవోసి ఇచ్చారనీ కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు. నష్టాలకు కారకులు పాలకులేనని, ప్రమా దాలకు వారే కారకులని ఆ కార్మికుడు చెప్పాలనే అనుకుని ఉంటాడు. అడుగుతున్న గనులు, శాశ్వత పరిష్కారాలు అరణ్య రోదనలయినవనీ, మృత్యుకుహరంలో శ్రమిస్తున్నామనీ ద్రావణాగ్ని సాక్షిగా కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు. కొడుక్కి మాత్ర మేనా... లోకానికీ, ముఖ్యంగా పాలకులకు చెప్పాలని అనుకొని ఉంటాడు. చెపితేనో? మరణ వాఙ్మూలం ఇస్తేనో?

- అట్టాడ అప్పల్నాయుడు 
కళింగ సీమ రచయితల వేదిక అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement