తరగతి గదిలో విభజన రేఖలు! | Education System Social Equality Common School System Kothari Commission | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో విభజన రేఖలు!

Sep 20 2026 1:59 PM | Updated on Sep 20 2026 1:59 PM

Education System Social Equality Common School System Kothari Commission

అభిప్రాయం

విద్య అనేది సమసమాజ నిర్మాణా నికి, సామాజిక సమానత్వానికి ప్రాథమిక పునాది. విభిన్న సామా జిక నేపథ్యాలు ఉన్న పిల్లలను ఒకే తాటిపైకి తెచ్చే గొప్ప సామాజిక వేదిక. కానీ, నేడు మన విద్యా వ్యవస్థ గురుకులం, బీసీ వెల్ఫేర్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ స్కూళ్లు... అంటూ కులాలు, వర్గాల వారీగా విడిపోయింది.

సంక్షేమం పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక పాఠశాలలు విద్యా వ్యవస్థను వర్గాల వారీగా విడదీస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం చాటే భారతీయ సమాజంలో విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్నప్పుడే పరస్పరం గౌరవించుకునే సంస్కృతి అల వడుతుంది. కులాలు, వర్గాలకు వేర్వేరు పాఠశాలల వల్ల చిన్నతనం నుంచే ‘మేము–వారు’ అనే భావన రూపుదిద్దుకుంటుంది. ఇది విద్యార్థికే కాదు, సమాజానికే ప్రమాదకరం.

వెనకబడిన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమనే మంచి లక్ష్యంతోనే ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక పాఠశాలలు పేద కుటుంబాలపై విద్యా భారాన్ని తగ్గించి, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఒకే విధమైన నేపథ్యం ఉన్న విద్యార్థులు ఒకే చోట చదవడం వల్ల, వారు బాహ్య సమాజంలోని వైవిధ్యాన్ని అనుభవించే అవ కాశం తగ్గుతుంది. ఇది వారిలో ‘మేము ప్రత్యేక వర్గానికి చెందినవారం’ అనే భావనను పెంచుతుంది. రేపు వీరు సమా జంలోకి వచ్చాక మిగిలిన వర్గాలు, ప్రజలతో మమేకం కాలేరు. కలిసిపోయి బతకాలి అనేది వీరిలో ఏమాత్రం ఉండదు.

కొఠారీ కమిషన్‌ సిఫార్సులు
వేర్వేరు వర్గాల పిల్లలు చిన్నతనం నుంచి కలిసి పెరిగి నప్పుడే కుల, మతరహిత ఆలోచనా ధోరణి పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సమాన విద్యా అవకాశాలు సాధించా లంటే పాఠశాలల విభజన కంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల లోనూ ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక వస తులు కల్పించడం ద్వారానే నిజమైన సమగ్ర వికాసం సాధ్య మవుతుంది. ఇందుకోసం కొఠారీ కమిషన్‌ సిఫార్సు చేసిన ట్లుగా ప్రాంతీయ ఆధారిత సాధారణ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలి.

కుల, మత, వర్గ వ్యత్యాసాలు లేకుండా సమీపంలోనే ఉన్న పాఠశాలలో విద్యార్థులందరూ కలిసి చదు వుకునే వాతావరణాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేక పాఠశాల లను నిర్వహించడానికి బదులుగా సాధారణ ప్రభుత్వ పాఠ శాలల్లోనే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌ షిప్‌లు, వసతి, పోషకాహార సౌకర్యాలు కల్పించాలి. ప్రతి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలలోనూ సమాన స్థాయి వసతులు, బోధనా ప్రమాణాలు కల్పించాలి. ప్రత్యేక గురుకులాల్లో నిర్దిష్ట శాతాన్ని మాత్రమే ఆ యా వర్గాలకు పరి మితం చేసి, మిగిలిన సీట్లను సాధారణ ప్రాతిపదికన వర్గాల కతీతంగా కేటాయించడం ద్వారా వైవిధ్య మైన విద్యా వాతావరణాన్ని సృష్టించాలి.

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన విద్యా వ్యవస్థలను పరిశీలిస్తే అవి ప్రత్యేక విభాగాలు లేదా వర్గీకరణల కంటే సమగ్ర విద్య, కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌లకే ప్రాధాన్యత ఇస్తు న్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా పేరొందిన ఫిన్లాండ్‌లో ప్రైవేట్‌ లేదా ప్రత్యేక వర్గాల పాఠశాలలు దాదాపు ఉండవు. ధనిక, పేద, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న పిల్లలందరూ ఒకే రకమైన పబ్లిక్‌ స్కూల్స్‌లోనే కలిసి చదువుకుంటారు. అమెరికాలో నివాస ప్రాంతాల ప్రాతిపది కన నడిచే పబ్లిక్‌ స్కూళ్లలో విభిన్న జాతులు, ఆర్థిక నేపథ్యాల పిల్లలు ఒకే తరగతి గదిని పంచు కుంటారు. విద్యార్థుల్లో వైవిధ్యాన్ని గౌరవించే తత్వాన్ని పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది. ఇక, భిన్న సంస్కృతులు, జాతులు ఉన్న సింగపూర్‌లో ప్రతి పాఠశాలలోనూ అన్ని వర్గాల పిల్లలు సమానంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది చిన్నతనం నుంచే జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది.

విలువలు– బాధ్యతలు
పిల్లలకు కేవలం పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, మధ్యాహ్నం భోజనం వంటివి ఇవ్వడంతోనే సరి పోదు. వాళ్ల చదువు, పనితీరును నిరంతరం ట్రాక్‌ చేయాలి. నైతికత, విలువలు, సహకారం, దేశం పట్ల ప్రేమ, బాధ్యత వంటివి కూడా తప్పనిసరి పాఠ్యాంశాలుగా చేయాలి.

మన దగ్గర హక్కుల గురించి మాట్లాడతారే కానీ బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు. బాధ్యతల గురించి చిన్నతనం నుంచే నేర్పిస్తే ఆ సమాజం ఎదుగుతుంది. చదవడం, పెరగడం ఒకే గొడుగు కింద జరిగేలా చూడటమే నిజమైన ప్రగతిశీల సమాజ లక్షణం. పిల్లలను చిన్ననాటి నుంచే వర్గాలుగా విడదీయకుండా, సమాజంలో ఐక్యతను పెంపొందించేలా ఉండటమే సమగ్ర విద్య అసలైన లక్ష్యం.

- నరేంద్ర కుమార్‌ కామరాజు, వ్యాసకర్త ప్రణీత్‌ గ్రూప్‌ ఫౌండర్‌–మేనేజింగ్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement