దశ దిశ మార్చే విజన్‌ అంటే ఇదే కదా! | Sakshi
Sakshi News home page

దశ దిశ మార్చే విజన్‌ అంటే ఇదే కదా!

Published Sat, May 4 2024 4:08 AM

Adusumilli Jayaprakash about ys jagan mohan reddy

అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి... రెండు పగ్గాలను ఒకే చేత్తో పట్టుకొని ప్రభుత్వాన్ని జనరంజకంగా నడపడం సాధారణ విషయం కాదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడకను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాను పాలన చేపట్టేనాటికి ఉన్న అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టడమే గాక ప్రతి పథకాన్నీ ఒక విజన్‌తో రూపొందించడం జగన్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక అవస్థా పనా సౌకర్యాల ఏర్పాటు, వ్యవసాయం, రైతు సంక్షేమం, బడుగు ప్రజలకు ఆవాసం... ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటి వెనుక సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కాన్సెప్టులూ పడుగు పేకల్లా కలిసే కనిపిస్తాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే మనకు మిగిలితే, ఆ సంఖ్యను రెట్టింపు చేసి 26 జిల్లాల రాష్ట్రంగా మార్చడంలో జగన్‌ విజన్‌ ఏమిటో మనకు స్పష్టమ వుతుంది.  అధికార వికేంద్రీకరణ జరిగితేనే ప్రజల వద్దకు పాలన అనే విజన్‌ కార్యరూపంలోకి వస్తుంది గనుక జిల్లాలను విభజించి కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు మరింత దగ్గరయ్యేట్లు చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలముంగిటకు చేర్చారు. 

ఏ శ్రేయో రాజ్యంలోనైనా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు ఎంత ఎక్కువగా ఉపాధి సమ కూరితే రాష్ట్రం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  దాదాపు  నాలుగు లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చింది. దీనికి అధికారికమైన లెక్కలు ఉన్నాయి. వాటిలో పర్మి నెంట్‌ ఉద్యోగాలే 2.31 లక్షలు ఉన్నాయంటే యువతకు ఉద్యో గాల కల్పన అంశానికి జగన్‌ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యమిచ్చిందో అర్థమవుతుంది. సరైన విజన్‌ అంటే ఇదేకదా!!

ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడమేకాదు, ముందు ముందు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాటికి ‘నైపుణ్య శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాలు రూపొందించడం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఇంజినీరింగ్, ఇతర విభాగాలలో విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచి వారిని వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి అర్హులుగా చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కాలేజీలు, తిరుపతి, విశాఖ నగరాల్లో స్కిల్‌ డెవలప్మెంట్‌ వర్సి టీలు కూడా సంకల్పించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనుకొనేవారు ఏ విధంగా ఆలోచిస్తారో దీనిని బట్టి తెలుసు కోవచ్చు. సమాజంలోని వివిధ ప్రాధాన్య వర్గాలను బేరీజు వేసుకొని వారికి సరిపోయే ప్రణాళిక రూపొందించాలనేది సరైన విజన్‌ ఉన్న నేతకే సాధ్యమవుతుందని కూడా దీనిని బట్టి అర్థమవుతుంది.

బడుగు ప్రజలు కూడా సమాజంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనీ, అభివృద్ధి ఫలితాలు వారు కూడా అందు కోవాలనే లక్ష్యంతో జగన్‌ తమ మొదటి మేనిఫెస్టోలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ‘నవరత్నాల’ను ప్రజలందరికీ అందించారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో... గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో తెలియజేసి, కొత్తగా మరికొన్ని పథకాలను ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా పేద పిల్లల చదువులకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యమిచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలనీ, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య నుంచి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ‘కళ్యాణమస్తు’, వంటి పథకాలుఅందుకే ప్రజల ఆదరణను అంతగా చూరగొన్నాయి. 

ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు... ఈ మూడు అంశా లలో రాష్ట్రం సాధించిన ప్రగతినే ‘వాస్తవ అభివృద్ధి’గా చెబుతారు. అందుకే ఈ అంశాలకు జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తుంది. మానవాభివృద్ధి పథ కాలు ఎంత ఎక్కువగా అమలైతే, సంక్షేమం అంత అభివృద్ధిగా మారుతుంది. ఇది తెలియని చాలా మంది సంక్షేమాన్ని అభివృద్ధిని వేర్వేరుగా చూస్తుంటారు. 

సంక్షేమం ముందుకు వెళ్తే అభివృద్ధిగా మారుతుందనే సిద్ధాంతాన్ని జగన్‌ నమ్మారు కనుకనే జగన్‌ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులైతేనే ఎన్ని పనులైనా చేయగలుగుతారు. దానిని దృష్టిలో ఉంచుకొనే ఆరోగ్యరంగాభివృద్ధికి ప్రభుత్వంపలు కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వైఎస్సార్‌ పేరిట, జగన్‌ పేరిట పలు పథకాలు అమలవు తున్నాయి. కొత్తగా పలువైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి జరుగుతోంది.

‘ఆరోగ్య శ్రీ’ ద్వారా రూ. 25 లక్షల విలువైన వైద్య చికిత్స అందించడానికి జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో పేరుపొందింది. పేదలు చికిత్స కోసం ఎలాంటి అప్పులు చేయ రాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం, ఉచిత సేవలను ఎక్కువ ఆసు పత్రులకు విస్తరించడం, చివరకు కేన్సర్‌ చికిత్స కూడా ఉచితంగా అందించడం ఎంతో విశేషం. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో ‘ఆరోగ్య ఆసరా’తో ఆదుకుంటున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. వృద్ధాప్య పెన్షన్‌ పెంపు, ‘వైఎస్సార్‌ చేయూత’ వంటి పథకాల ద్వారా ఏ ఇంటిలోనూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణం సృష్టించడంకంటే ‘శ్రేయోరాజ్య’నికి అసలైన అర్థం ఇంకేం ఉంటుంది?

పాలనలో పిరమిడ్‌ నమూనాను పక్కన పెట్టి, చతురస్ర నమూనాను స్వీకరించడం జగన్‌ ప్రత్యేకత. ప్రభుత్వ పథకాలు అమలు అన్ని వైపులకు విస్తరించడానికి (అధికార యంత్రాంగం సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా పథకాల ప్రయోజనాలు అందరికీ అందేట్లు చేయడం) ఈ చతురస్ర నమూనాను అనుస రించడం ఒక చక్కని ప్రయోగం. ఇలా ఒకటి రెండు కాదు, ‘జగన్‌’ను తెర మీద పరచే కార్యక్రమాలు, పథకాలు అనేకానేకం. అన్నీ ప్రజాదరణ పొందడం ఒక విశేషం. వాటన్నిటితో పాటు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరింత కొత్త ‘విజన్‌’తో ముందుకు వస్తానని జగన్‌ ప్రకటించడం ముదావహం.

- వ్యాసకర్త ఏపీ మాజీ శాసనసభ్యులు ‘ 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాష్‌
 

Advertisement
Advertisement