‘రేసుగుర్రం’ మూవీలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో అలరించిన తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ప్రజా నాయకుడిగా మన్ననలను అందుకుంటున్నారు. అలాంటి ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ 57 ఏళ్ల వయసులో చక్కటి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన వెయిట్లాస్ జర్నీ గురించి వెల్లడించారు. తను కావాలంటే బరువు పెరగగలను, అదుపులోనూ ఉంచుకోగలనని అన్నారు. అయితే బరువు తగ్గడం కోసం కఠిన ఆహార నియమాలతో పనిలేదని చెబుతున్నారు. స్థిరమైన జీవనశైలి మార్పులతోనే సులభంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా.!.
రవికిషన్ తాను వెయిట్లాస్ జర్నీలో తక్షణ పరిష్కారాల కంటే పౌష్టికరమైన భోజనం, క్రమం తప్పని వ్యాయామం, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. తాను ఒకప్పుడు సుమారు 90 కేజీల దాక బరువు ఉండేవాడినని, ప్రస్తుతం 72 కేజీల వరకు తగ్గానని అన్నారు. కండరాలు పెంచుకుంటూ, సన్నబడుతున్నానని అన్నారు. రాజకీయ విధులు, గోరఖపూర్ నియోజకవర్గ పర్యటనలు కారణంగా కొంత బరువు పెరిగానని అన్నారు.
దాంతో తను పండ్లతో కూడిన ఆహారం తింటూ స్లిమ్గా అయ్యానని అన్నారు. తినే విధానం మార్చుకుంటూ సుమారు 18 కేజీలు దాక తగ్గినట్లు వెల్లడించారు. వెండి తెరపై వచ్చే పాత్రల కారణంగానే ఫిట్గా మారాల్సి వచ్చిందన్నారు. తాను "'లాపటా లేడీస్' కోసం బరువు పెరగాల్సి వచ్చిందన్నారు. మళ్లా 'మిర్జాపూర్: ది మూవీ'లో సన్నగా కనిపించగా, 'నాగ్జిల్లా'లో నేను సూపర్-ఫిట్ బాడీతో ఉంటానని చెప్పుకొచ్చారు.
అయితే 50 ఏళ్ల వయసులో మాత్రం..ఇదంతా అంత సులభం కాదని అన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులతో దాన్ని ఈజీగా సాధించొచ్చని అన్నారు. మనం తినేది సుమారు 70-80% అని, మిగిలిందంతా వ్యాయామమేనని అన్నారు. ఇక తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ..కేవలం పండ్లకే పరిమతం కానని చెప్పారు. 'వన్ మీల్ ఏ డే' అనే ఓమాడ్ టెక్నిక్ని ఫాలో అవుతానని అన్నారు.
అంటే..ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం, మధ్యంతర ఉపవాసం లేదా కేవలం పండ్లు మాత్రమే తినడం. రవి కిషన్ అలాంటి డైట్ని చేయగలిగే శక్తి ఆ మహాదేవుడు తనకిచ్చిన వరంగా అభివర్ణించారు. అయితే రాజకీయ బాధ్యతలను నిర్వర్తించడానికి దానిలో కొద్దిగా మార్పులు చేస్తుంటానని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో..తన డైట్ విధానం మారిపోతుందట. ఆ రోజుల్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సలాడ్ తీసుకుంటానని అన్నారు.
అవసరం అనుకుంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, నెయ్యి కూడా తీసుకుంటానని అన్నారు. తనకు ఇష్టమైన పండ్ల గురించి మాట్లాడుతూ..తన భోజనంలో తప్పనిసరిగా అవకాడో, కివీ, ఆపిల్, అరటిపండ్లు, నారింజ, తాజా పండ్ల రసాలు ఉంటాయని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, కండరాల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలని రవి కిషన్ నొక్కి చెప్పారు.
(చదవండి: కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..)


